కొన్ని సినిమాలు కళ్ళతో చూస్తారు… మరికొన్నింటిని మనసుతో చూస్తారు… ఇటీవల కాలంలో మనసుతో చూసే సినిమాలు చాలా తక్కువ సంఖ్యలో వస్తున్నాయన్నది బహిరంగ రహస్యమే. అయితే అలాంటి ఒక చిత్రమే తమ “నాన్నకు ప్రేమతో” అని జూనియర్ ఎన్టీఆర్ అంటున్నారు.
“నాన్నకు ప్రేమతో” సక్సెస్ మీట్ లో వ్యాఖ్యానించిన జూనియర్… “ఈ సినిమా ద్వారా తమకు ఎంతో గౌరవం వచ్చిందని, ఈ సినిమా సాధించిన కలెక్షన్స్ కంటే, లభించిన సంతృప్తి చాలా ముఖ్యమని” బుడ్డోడు అభిప్రాయ పడ్డారు. చిత్ర యూనిట్ అంతా మనసుపెట్టి పని చేసారని, సినిమాలో నటించిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సినిమా విజయానికి దోహదపడిందని, అలాగే టైటిల్ కు ఊపిరి పోసిన పాత్రలో రాజేంద్రప్రసాద్ నటన అమోఘమని, ప్రేక్షకులు ఇచ్చిన తీర్పు మరిన్ని మంచి చిత్రాలు తీయడానికి అవకాశాన్ని ఇచ్చారని అన్నారు.
ఎన్టీఆర్ మార్క్ సిగ్నేచర్ ట్యూన్ తో చిత్ర యూనిట్ ఈ సక్సెస్ మీట్ ను ముగించడం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ వంటి ముఖ్య తారాగణంతో పాటు దర్శక నిర్మాతలు పాల్గొన్నారు.





