“నాన్నకు ప్రేమతో” ఇచ్చిన కొత్త ఉత్సాహంలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆ సినిమా ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నారు. చేస్తున్న ప్రమోషన్లో లేక సినిమా నెమ్మదిగా ప్రేక్షకులకు ఎక్కిందో గానీ వీకెండ్స్ లో ధియేటర్ల వద్ద ‘హౌస్ ఫుల్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో భారీ నష్టాలను “నాన్నకు ప్రేమతో” మిగుల్చకపోవచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
ఇక, తాజాగా ఓ ప్రముఖ దినపత్రికకు జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన వీక్లీ మ్యాగ్ జైన్ ఇంటర్వ్యూలో… చావుకు సంబంధించిన అనుభూతులను పంచుకున్నారు. “నా సిద్ధాంతం కొత్తగా వింతగా ఉంటుంది. ‘ఇదేంటి ఎన్టీఆర్ ఇలాక్కూడా ఆలోచిస్తాడా’ అనిపిస్తుంది. మా అమ్మ పడుకొనేటప్పుడు ‘పొద్దుట టిఫిన్ ఏం చేయను’ అని అడిగేది. ‘పొద్దున్న లేవాలి కదమ్మా… ఎవరికి తెలుసు..? ఇదే చివరి నిద్రేమో’ అనేవాడ్ని. నా ఆలోచనలు అలా ఉంటాయి. ‘ఆశ’ అనే ఓ చిన్న రేఖపై బతుకుతున్నాం మనం. ఏమో… ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు?” అంటూ వేదాంత ధోరణిలో వ్యాఖ్యానించారు.
ఈ చిన్న జీవితంలో ఇన్ని గొడవలెందుకు? నా కోరిక ఒక్కటే… చనిపోయే ముందు ఒక్క క్షణం కూడా గిల్టీగా ఫీలవ్వకూడదు. చావూ వచ్చావా? తీసుకెళ్ళిపో…’ అనేలా ఉండాలి. అంతే తప్ప… ఒక్క రోజు బతికితే అది చేసేవాడ్ని కదా, ఇది చేసేవాడ్ని కదా’ అనుకోకూడదు. అంత పరిపూర్ణ జీవితం అనుభవించాలి. అపుడు చావుని ఆహ్వానించాలి. 2009 మార్చి 26న జరిగిన కారు ప్రమాదం నా ఆలోచనల్ని పూర్తిగా మార్చేసింది. ఆ క్షణాలు ఇంకా గుర్తు. కన్నుమూసి తెరిచేలోగా ప్రమాదం జరిగిపోయింది. ఎక్కడెక్కడ ఎన్ని ఎముకలు విరిగాయో నాకే స్పష్టంగా తెలిసిపోయింది. ఒళ్ళంతా రక్తం. సూర్యాపేట ఆసుపత్రికి వెళ్తుంటే… నా జీవితమంతా ఒక్కసారి కళ్ళ ముందు తిరిగింది.
“నా సినిమాలు, అమ్మ, అభిమానులు, నా వస్తువులు, చివరికి నేను పెంచుకుంటున్న కుక్క పిల్ల… అన్నీ… ఏంటి… జీవితం అయిపోయిందా? అనిపించింది. చచ్చిపోతనన్న భయం లేదు గానీ, సాధించాల్సింది ఇంకా ఉంది కదా… అనిపించింది. మరో విశేషమేమిటంటే, అదే రోజున నా భాగస్వామి ప్రణతి పుట్టినరోజు. దీంతో దేవుడే తనకు ప్రణతిని పంపించాడని భావించి, ఆ రోజున రెండు పుట్టినరోజులు జరుపుకుంటాం” అంటూ జూనియర్ తన యాక్సిడెంట్ ఉదంతాలను కూడా గుర్తుకు తెచ్చుకున్నారు.





