తెలుగు భాషలో ప్రస్తుతం కొనసాగుతున్న దినపత్రికల్లో అత్యధిక కాలంగా ముద్రితమవుతున్న ‘ఆంధ్రప్రభ’ యాజమాన్యం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనుంది. నేడు కాకినాడలో జరిగే బహిరంగ సభలో మాజీ మంత్రి, ‘ఆంధ్రప్రభ’ దినపత్రిక చైర్మన్ ముత్తా గోపాలకృష్ణ, ఆయన కుమారుడు శశిధర్ లకు వైఎస్ జగన్ స్వయంగా పార్టీ కండువా కప్పి ఆహ్వానించనున్నారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కూడా వైకాపాలో చేరనున్నారు.
కాగా, కాకినాడ ప్రాంతంలో బలమైన నేతగా పేరున్న ముత్తా కుటుంబం చేరికతో వైకాపాకు బలం చేకూరుతుందని వైకాపా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్టీఆర్ హయాంలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన ముత్తా, ఆపై కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలో కాకినాడ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్సార్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వకపోగా, ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. అప్పటి నుండి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన ముత్తా, ఇప్పుడు వైకాపాలో చేరాలని నిర్ణయించుకోవడం గమనార్హం.





