గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమి తరఫున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రచారం చేయడం లేదు..? తెలంగాణకు ఆయువు పట్టు వంటి హైదరాబాద్ నగర మేయర్ పీఠం ఎన్నికలకు ఎందుకు దూరంగా ఉండిపోయారు? ఇటీవల బీజేపీ నేత కిషన్ రెడ్డి, టీడీపీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి పవన్ వద్దకు వెళ్లి తమ కూటమి తరఫున ప్రచారం చేయాలని కోరినా పవన్ ఎందుకు సున్నితంగా తిరస్కరించారు?
“సర్దార్ గబ్బర్ సింగ్” సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడం అనేదే కారణమా? లేక అసలు కారణం వేరే ఉందా? అంటే ఖచ్చితంగా ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు అవినీతిలో కూరుకుపోయాయని భావిస్తున్న పవన్, వాటిని మట్టి కరిపించేందుకే గత సార్వత్రిక ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారన్నది సుస్పష్టం. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలాగూ పోటీ చేయకుండా తప్పుకుంది.
ఇక కాంగ్రెస్ పార్టీ మాత్రం టీడీపీ-బీజేపీ కూటమిని ఎదుర్కొనేందుకు నానా పాట్లూ పడుతోంది. మరో వైపు అధికార పార్టీ టీఆర్ఎస్ హవా బలంగా కొనసాగుతోంది. దీంతో తానూ రంగంలోకి దిగక పోవడమే శ్రేయస్కరమని పవన్ భావించినట్లుగా తెలుస్తోంది. ఈ కారణంతోనే ప్రస్తుతానికి బీజేపీ-కూటమికి తన సేవలు అవసరం లేదని, ఈ కూటమి సొంతంగానే ఈ ఎన్నికల్లో పోరాడాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నందువల్లే ఆయన సైలెంట్ గా ఉండిపోయారని పొలిటికల్ వర్గాల టాక్.





