“విలీనం’’ అన్న పదం వినగానే మనకు ఠక్కున గుర్తుకు వచ్చేది మాత్రం “కొణిదల శివశంకర వరప్రసాద్” అలియాస్ “మెగాస్టార్ చిరంజీవి.” తానూ స్థాపించిన “ప్రజారాజ్యం” పార్టీని సముద్రం లాంటి కాంగ్రెస్ లో విలీనం చేసి తన రాజకీయ భారాన్ని దింపుకున్న చాలా కాలం తరువాత….. ఈ “విలీనం” అన్న పదానికి మళ్ళీ క్రేజ్ తీసుకొచ్చే బాధ్యతను పవన్ తన భుజస్కంధాలపై వేసుకున్నట్లు కనపడుతోంది.
అయితే పవన్ నిర్వర్తిస్తున్న ఈ విధులు రాజకీయ పార్టీ అయిన “జనసేన” అధినేతగా కాకుండా, సినీ హీరోగా ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే “పవర్ స్టార్’’గా మోయనుండడం విశేషం. ‘అన్నయ్య’ చిరు చేసిన రాజకీయ పార్టీ ‘విలీనం’ వలన చీలికలతో విచ్ఛిన్నం అయిన మెగా అభిమానులను ఒకటి చేసే ప్రక్రియలో భాగంగా పవన్ ఈ విలీనానికి ముందుకొచ్చినట్లు సమాచారం.
ఈ మెగా బ్రదర్స్ మధ్య ఏర్పడిన రాజకీయ దూరం వల్ల, సినీ ఇండస్ట్రీలో ఆ కుటుంబానికి కూడా కొంతమేర నష్టం జరిగిందనే మాట వాస్తవమే. గతంలో ‘మెగాస్టార్’గా చిరుకున్న పట్టు కాస్త సడలిందని ‘కత్తి’ కధ రీమేక్ వివాదం వంటి చిన్న చిన్న అంశాలలో కూడా స్పష్టంగా బయటపడింది. దీంతో ప్రస్తుతం రాజకీయంగా ఎలా ఉన్నా, మెగా అభిమానులను ఏకం చేసేందుకు పవన్ సిద్ధమయ్యారని తెలుస్తోంది. ముందుగా చిరు ‘సర్ధార్’ సెట్స్ లో హల్చల్ చేయగా, తాజాగా పవన్ కూడా ‘మెగా – పవర్’ అభిమానుల్లో ఐక్యత పెంచేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారని టాక్.
ఇది ‘అన్నయ్య’ కోరికో లేక ‘తమ్ముడు’ ఆశయమో తెలియదు కానీ, ఈ విలీన ప్రక్రియ మాత్రం మొదలయిందని… ఒకప్పుడు మెగా అభిమానులుగా పిలుచుకునే మెగా – పవర్ ఫ్యాన్స్ కు ఒక అవగాహన వచ్చినట్లుంది. పవన్ కళ్యాణ్ తాజా చిత్రం “సర్ధార్ గబ్బర్ సింగ్” సినిమా ఆడియో విడుదలకు ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవిని, టవర్ స్టార్ నాగబాబును ఆహ్వానించి ఈ “విలీన” ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నారని విశ్వసనీయ సమచారం. మరి ఈ “విలీనానికి” అభిమానుల మద్దతు ఉంటుందో లేదో చూడాలి.



