తూర్పు గోదావరి జిల్లా, తుని వద్ద జరిగిన సంఘటనను విశ్లేషించిన పవన్ కళ్యాణ్, ఈ ఉదంతంపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. మొదటగా… రాష్ట్రం శాంతి యుతంగా ఉండాలని కోరుకుంటూ, అసలు ఈ డిమాండ్ ఎక్కడ నుండి ప్రారంభమైంది అని చూస్తే… కాపులను బీసీలలో చేర్చాలని ఉన్న డిమాడ్ ఈ ఒక్క రోజులో వచ్చింది కాదు, నాటి బ్రిటిష్ కాలం నాటి నుండి ఆంధ్ర ప్రజలు మద్రాస్ లో ఉన్నప్పటి నుండి దీనిపై పోరాటాలు జరిగాయని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
కాపుల విషయానికి వస్తే, తూర్పు ఆంధ్రా, తెలంగాణాలో కాపులు వెనుకబడిన కులాలుగా ఉన్నారని, రాయలసీమ, కోస్తాలో మాత్రం ఉన్నత వర్గాలకు చెందిన వారిగా ఉన్నారని, అలాంటి వారిని ఓటు బ్యాంక్ గా వాడుకుని వదిలేస్తున్నారనే ఆగ్రహంతో ఈ ఉద్యమం మొదలైందని పవన్ తెలిపారు. మన ప్రజాస్వామ్యంలో ఎవరికీ ఇష్టం వచ్చింది వారు చేసుకోవచ్చు, అది సభలైనా ఇంకేమైనా… అన్న పవన్, ఈ ఉదంతం మొత్తన్ని పరిశీలిస్తే… ఖచ్చితంగా దీని వెనుక అసాంఘిక శక్తులు ఉన్నాయని తానూ నమ్ముతున్నానని పవన్ తెలిపారు.
“రైలు ఒక అగ్గిపుల్ల వేస్తె కాలేది కాదు, అది కూడా కోస్తా మరియు ఉత్తరాంధ్రలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవు. దీని వెనుక ఎవరున్నారో నాకు ఖచ్చితంగా తెలియదు, అందుకే ఎవరి మీద నిందలు వేయడం లేదు, అయితే కొన్ని అసాంఘిక శక్తులు మాత్రం ఉన్నాయి. లేదంటే 10 భోగీలు అలా తగలబడిపోవని పవన్ ఆవేదన వ్యక్తం చేసారు. అయితే ఇన్ని లక్షల మంది సమూహం ఒక చోటకు చేరుకుంటున్నపుడు సరిపడా పోలీసు బలగాలతో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలమైందని” ప్రభుత్వ పరమైన లొసుగులను ఎత్తి చూపే ప్రయత్నం చేసారు.
అయితే, కాపులను బీసీల్లో చేర్చాలనే అంశంపై ఇప్పటికే ఒక కమీషన్ వేసారని, దాని వలన ప్రయోజనం లేకపోయిందని, ఇది ఒక్క టిడిపిపై ద్వేషంతో చేసిన చర్య కాదని, అయితే ప్రభుత్వం నమ్మకాన్ని కలిగించలేక పోయిందని అన్నారు. “రాజకీయ లబ్ధి నా ఉద్దేశం కాదు, అన్ని పార్టీలు కలిసి ఈ సమస్యను పరిష్కరించాలి, లేదంటే కులాల మధ్య చిచ్చు రాజుకుంటుంది, ప్రతి రాజకీయ నాయకుడు గానీ, పార్టీ గానీ బాధ్యతతో వ్యవహరించాల్సిన సమయం ఇది, పరిస్థితులను చేయి దాటకుండా చూడాలి, ఉద్యమ నాయకుల్లో స్ఫూర్తి ఉండాలి, సహాయ నిరాకరణ ఉద్యమంలో 20 మంది పోలీసులను తగలబెట్టడం వలన గాంధీజి తేవాలనుకున్న స్వాతంత్ర్యం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిందని, అందుకని ఉద్యమాన్ని నడిపే నాయకులు కూడా చాలా బాధ్యతతో మాట్లాడాల్సి ఉంటుందని సూచనలు చేసారు.
“నేను ఏ ఒక్క కులానికి ప్రాతినిధ్యత వహించను, జాతీయ సమగ్రత గురించి ఆలోచించి రాజకీయాల్లోకి వచ్చాను. కాపులను బీసీల్లో చేర్చలేకపోవడానికి గల కారణాలను ఎన్నికల ప్రచారంలో తెలియజేసినట్లయితే ఈ రోజు ఈ సమస్య వచ్చేది కాదని, ఇది రాజకీయ పార్టీలు అవలంభిస్తున్న పార్టీల తప్పుగా భావించాలి” అని చెప్పిన పవన్ కళ్యాణ్… ఈ అంశం అమలు కావాలంటే చట్టబద్ధంగా రావాలి, రాజ్యాంగ సవరణలు అవసరమవుతాయని పవన్ చేసిన వ్యాఖ్యలు, అసలు సత్యాలను పవన్ పరోక్షంగా చెప్పకనే చెప్పారా…? అన్న కోణంలో అభిప్రాయాలు వెలువడుతున్నాయి.





