తుని సంఘటనను ప్రస్తావిస్తూ మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. “కాపులను బీసీల్లోకి చేరుస్తామంటూ టిడిపి ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడం వలనే ఈ ఘటన జరిగిందని, ఇది ఒక్క కాపు కమీషన్ తోనే ఆగిపోదని, రాష్ట్రంలో రైతులు, ఇతర కులాలకు చేసిన హామీలను విస్మరిస్తే అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వస్తుందని చెప్తూ” రాసిన లేఖపై తన అభిప్రాయాన్ని చెప్పాల్సిందిగా పవన్ కళ్యాణ్ ను మీడియా వర్గీయులు అడిగారు.
తుని ఘటనపై స్పందించడానికి కేరళ నుండి వచ్చిన పవన్ కళ్యాణ్, తన అభిప్రాయాన్ని చెప్పిన తర్వాత మీడియా వర్గీయులు అడిగిన పలు ప్రశ్నలకు జవాబిచ్చారు. ఈ క్రమంలోనే చిరు లేఖను చదివి వినిపించిన ఓ మీడియా ప్రముఖుడు, దీనిపై స్పందిన్చాల్సింగా కోరారు. అయితే, సదరు మీడియా ప్రతినిధి చదివిన మొత్తాన్ని విన్న పవన్, దానిని పక్కన పెట్టి మరో ప్రశ్నకు జవాబివ్వడం విశేషం. ఇదంతా మీడియా మాధ్యమాలలో ‘లైవ్’ ప్రసారం కావడంతో, చిరు లేఖకు పవన్ ఇచ్చిన ప్రాధాన్యత ప్రత్యక్షమైంది.
బహుశా చిరు వ్యక్తపరిచిన అభిప్రాయం తన భావాలతో విభేదించడం వలనే పవన్, ఆ ప్రశ్నను ఎస్కేప్ చేసి ఉంటారని లేదంటే దానికి కూడా జవాబిచ్చేవారని పరిశీలకులు అంటున్నారు. అయితే, చిరంజీవి రాసిన లేఖ కంటే, పవన్ ప్రసంగమే కాస్త మెరుగగా, పరిపక్వతతో ఉందని రాజకీయ ప్రముఖులు విశ్లేషిస్తున్నారు.





