కిర్లంపూడిలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు తీసుకుంటున్న జాగ్రత్తల పట్ల దర్శకరత్న దాసరి నారాయణరావు తీవ్రంగా మండిపడుతున్నారు. ముద్రగడ పద్మనాభంను కలిసి పరామర్శించడానికి వచ్చిన దాసరి రాజమహేంద్రవరంలోని ఒక హోటల్ లో బస చేసారు. అయితే, కిర్లంపూడికి దాసరి చేరుకుంటే, కొంత ఉద్రిక్తత నెలకొంటుందని భావించిన పోలీసులు దాసరి ఉన్న హోటల్ ను చుట్టుముట్టారు. దీంతో దాసరి అడుగుతీసి బయటపెట్టడానికి ఆస్కారం లేకుండా పోయింది.
పోలీసుల చర్యలపై కోపోద్రేక్తులైన దాసరి… “ముద్రగడ పద్మనాభం నాకు స్నేహితుడు. ఆయనను పరామర్శిచేందుకు నేను రావడం తప్పా? పాకిస్థాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదిలా నన్ను పోలీసులు ట్రీట్ చేస్తున్నారు. నిన్న రాత్రి నుంచి పోలీసులు నన్ను అడుగడుగునా అడ్డుకుంటున్నారు. ఒకవేళ నన్ను అరెస్ట్ చేస్తే బెయిల్ కూడా తెచ్చుకోను. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ముద్రగడను పరామర్శించి తీరతా” అంటూ ఉద్వేగభరితంగా ప్రసంగించారు.
ఇదిలా ఉండగా, మరో ప్రక్కన ముద్రగడతో మంత్రి అచ్చేన్నాయుడు నేతృత్వంలో బృందం చర్చలు ప్రారంభించింది. ఈ చర్చలు సఫలీకృతం అయితే, ముద్రగడ దీక్ష విరమించే అవకాశం కనపడుతోందని సమాచారం. వైద్య పరీక్షలకు ముద్రగడ దంపతులు సహకరించకపోవడంతో, వారి ఆరోగ్య పరిస్థితుల రీత్యా అనుచరులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.





