ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా ఆశీస్సులతోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందన్న వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై పీఎంవో ఆగ్రహం వ్యక్తం చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ తీసుకునే వివాదాస్పద నిర్ణయాలను తమ మీదకు నెట్టి తమకు రాజకీయంగా ఇబ్బంది కలిగిస్తున్నారని ప్రధాని మోడీ భావనగా తెలుస్తుంది. రాష్ట్ర నేతలు ఇప్పటికే దాని గురించి హై కమాండ్ దృష్టికి తీసుకెళ్ళినట్టు సమాచారం.
దీంతో పీఎంవో విజయసాయిని, అజయ్ కల్లాంను ఢిల్లీకి పిలిపించి.. వివరణ కోరింది. వారితో పాటు కొందరు శాఖల అధికారులు కూడా వెళ్లినట్టు తెలుస్తుంది. అసలు ఆంద్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? పీపీఏల సమీక్ష, పోలవరం టెండర్ల రద్దు వాటన్నింటిపై వివరణ ఇవ్వడం కోసం విజయసాయిరెడ్డి, అజయ్కల్లాం పీఎంవో కార్యాలయానికి వచ్చారు. నిన్న పోలవరం హైడెల్ ప్రాజెక్టు రీ-టెండర్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను కేంద్రం సమర్ధించే అవకాశం లేదని అంటున్నారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తి ఖర్చు కేంద్రం భరిస్తుంటే తమకు చెప్పకుండా, తమ మాట వినకుండా కాంట్రాక్టులు రద్దు చేసి, కొత్త టెండర్లను పిలవడం కేంద్రం పెద్దలు జీర్ణించుకోలేకపోతుందంట. అదే విధంగా ఏపీ రాజధాని ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీయే శంకుస్థాపన చేశారని, అటువంటి రాజధానినే మార్చాలనుకోవడం కూడా బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారట. రాజధాని మార్పు దిశగా రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దానికి కేంద్ర మద్దతు ఇవ్వదని బీజేపీ నేతలు అంటున్నారు.





