రాష్ట్ర విభజన జరిగిన తరువాత ప్రభుత్వ సంస్థలన్నీ ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ కేంద్రంగానే విధులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్య సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగులు హైదరాబాద్ లో ఉండడం వలన పాలనా వ్యవహారాలలో జాప్యం జరుగుతోందని భావించిన శాఖలన్నింటిని విజయవాడ పరిసర ప్రాంతాలకు తరలించాలని ఆదేశించిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది జూన్ నాటికి ప్రభుత్వ రంగ కార్యకలాపాలన్నీ బెజవాడలోనే జరగనున్న నేపధ్యంలో రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెడుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే రాష్ట్ర అభివృద్ధి దేవుడెరుగు బెజవాడలో ఇళ్ళ అద్దెల విషయంలో మాత్రం చాలా ఉహించని అభివృద్ధి జరిగిందని స్థానిక వాసులు పేర్కొంటున్నారు. విజయవాడలోని సామాన్య ప్రజలు ఇంటి అద్దె ధరలు చూసి బెంబెలేత్తుతున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు, ఎం.ఎల్.ఎలు, అధికార ప్రతినిధులు అందరూ విజయవాడ కేంద్రంగా వారి భాత్యతలను నిర్వహించాలనే సరికి బెజవాడలో నివాస గృహాల కొరత మొదలైంది. అదే అదునుగా ఇంటి అద్దెలను పెంచి చుక్కలు చూపిస్తున్నారు గృహ యజమానులు. ఈ విషయమై సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే చాలా సార్లు బహిరంగగానే ఇంటి యజమానులకు విజ్ఞప్తి చేసారు.
రాష్ట్రాన్ని విడగొట్టిన వారే మనల్ని చూసి అసూయపడేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని చంద్రబాబు నాయుడు తాజాగా కూడా వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతం అభివృద్ధిలో మనల్ని చూసి ఎవ్వరూ అసూయ పడడం లేదు కాని మన రాజధాని పరిసర ప్రాంతాలలో అద్దెలను చూసి మాత్రం తోటి రాజధాని వాసులు అసూయ పడడం ఖాయం అంటున్నారు పరిశీలకులు.



