అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా ఉండడానికి సరిపోదని, రాజధానికి వరద ముప్పు ఉండటం వల్ల మల్లింపు ఖర్చు ఎక్కువ అవుతుందని దాని వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని మునిసిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ నిన్న మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు. రాజధాని మార్పు తప్పదని ఆయన చెప్పకనే చెప్పారు. ఈరోజు అన్ని దినపత్రికలలో ఈ వార్త ప్రముఖంగా వచ్చింది. ఈనాడు అయితే బ్యానర్ ఐటెం వేసింది.
దాని బట్టి ఈ వార్త ఎంత ప్రముఖమైనదో చెప్పవచ్చు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కారపత్రికైన సాక్షి దానిని పూర్తిగా విస్మరించింది. కనీసం జిల్లా ఎడిషన్ లో కూడా వెయ్యలేదు అంటే తొందరపడి ఒక కోయిల ముందే కూసిందా? అన్న చందాన బొత్స తొందరపడ్డారా అనే అనుమానం రాకమానదు. ఇది వరకు కూడా ఒకసారి బొత్స రాజధాని మీద ఇటువంటి కామెంట్ చేసి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేత తల అంటించుకున్నారు అనే వార్తలు వచ్చాయి. అయినా తీరు మారలేదు అనే చెప్పుకోవాలి.
ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన తమ మొదటి బడ్జెట్ లో అమరావతి నిర్మాణానికి అరకొర నిధులు కేటాయించిన విషయం తెలిసిందే. ఆరోజు నుండీ రాజధాని విషయంలో జగన్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అనే అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. రాజధాని ప్రాంతంలోని అన్ని పనులను ప్రభుత్వం ఆపేసింది. భూమి రేట్లు క్రమంగా పడిపోతున్నాయి. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ఇప్పుడు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు అనడంతో ఎటువంటి సందేహం లేదు.





