భారత్, పాక్లకు కొన్ని గంటల వ్యవధిలో స్వాతంత్ర్యం లభించింది. కానీ ఈ ఏడున్నర దశాబ్దాలలో భారత్ ఎక్కడుంది? పాక్ ఎక్కడుంది? అనే ప్రశ్నకు సమాధానం.. దానికి కారణాలు యావత్ ప్రపంచానికి తెలుసు.
భారత్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత్ ప్రధానులు ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగురవేసి స్పూర్తిదాయకమైన ప్రసంగాలు చేస్తుంటారు.
దేశాభివృద్ధి గురించి వివరించి, భారత్ని అగ్రదేశాల సరసన నిలపడం గురించి మాట్లాడుతుంటారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ స్థానం గురించి మాట్లాడుతారు. వారు చెప్పింది నూటికి నూరు శాతం కాకపోయినా కనీసం 75-85 శాతం నిజమని దేశాభివృద్ధిని చూస్తే అర్ధమవుతుంది.
నేడు పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం. మరి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ ఏడున్నర దశాబ్దాలలో పాక్లో జరిగిన అభివృద్ధి గురించి చెప్పుకోవాలి కదా?
కానీ ప్రభుత్వంపై సైన్యం పెత్తనం, పాలకుల అవినీతి, నిరుద్యోగం, పేదరికం.. వాటి కారణంగా యువత ఉగ్రవాదులలో చేరుతుండటంతో గురించి ఏమని చెప్పుకోగలరు?
ఇంతకీ విషయం ఏమిటంటే, పాకిస్తాన్లో అభివృద్ధి గురించి చెప్పుకునేందుకు ఏమీ లేదు కనుక పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దేశ ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, సింధూ నదీ జలాలను భారత్ అడ్డుకుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
సింధూనదీ జలాలపై తమ హక్కుని భారత్ నిరాకరిస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని భారత్ని హెచ్చరించారు. నాడు ‘ఆపరేషన్ సిందూర్’ని ఏవిధంగా బలంగా తిప్పి కొట్టామో, ఈసారి అంతకంటే దీటుగా బదులిస్తామని హెచ్చరించారు.
సింధూ జలాలను భారత్ దిగువకు వదలడం లేదని దేశ ప్రజలకు చెప్పుకోలేక ప్రధాని షరీఫ్ ఇలా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం చాలా హాస్యాస్పదంగా ఉంది. కానీ పాక్ పాలకులకు, సైన్యాదికారులకు ఇది బాగా అలవాటే కనుక మరోసారి ప్రదర్శించారు అంతే!
భారత్ని బూచిగా చూపిస్తూ ఇలాంటి మాటలతోనే పాక్ పాలకులు 75ఏళ్ళు లాగించేశారు. మరో 25 ఏళ్ళు కాలక్షేపం చేయగలరు. అప్పుడు పాకిస్తాన్కి అందనంత ఎత్తులో బహుశః అగ్రదేశాల సరసన భారత్ ఉంటుంది. ఇది మన అదృష్టం అది వారి దౌర్భాగ్యం!




