టిడిపి అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ అధినేత జగన్, రోజాలపై మండిపడ్డారు టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అక్రమాస్తుల కేసులతో దేశమంతా పాపులర్ అయిన జగన్ చరిత్ర నాంపల్లి కోర్టు నుండి సుప్రీంకోర్టు వరకు తెలుసనీ, నేర ప్రవృత్తి ఆయన నైజమని, ఎవరు మోసగాడో అందరికీ తెలుసని జగన్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసారు సోమిరెడ్డి.
రోజా వ్యాఖ్యలపై మండిపడ్డ సోమిరెడ్డి, “రెండంకెల అభివృద్ధి చంద్రబాబు సొంతమైతే, లక్షల కోట్లు అక్రమాస్తులు కూడబెట్టే విధానం జగన్ సొంతమని, వీరు నీతి, నిజాయితీ గురించి మాట్లాడటం తగదని, వైయస్ ‘అ ఆ’ లు నేర్చుకోమంటే అవినీతి నేర్చుకున్న ఘనత జగన్ దని, ఐఏఎస్, ఐపీఎస్ లను జైలుకు పంపించిన జగన్ సొంత ఆస్తులను ప్రకటించడానికి భయపడుతున్నారని, అవన్నీ అక్రమాస్తులైతే ఎలా ప్రకటిస్తారని, ఎప్పుడు ఈడీ తీసుకుంటుందో, ఏ ఆస్తి జగన్ వద్ద ఉంటుందో తెలియదని” ఓ స్థాయిలో దుయ్యబట్టారు.
“ప్రతి ఏటా ఆస్తుల వివరాలు ప్రకటించే చంద్రబాబు జీవితం తెరిచిన పుస్తకం లాంటిదని, జనం కోసం చంద్రబాబు కష్టపడుతుంటే, జగన్ డబ్బు కోసం పని చేస్తారని, వచ్చే ఎన్నికలలో ఏపీలో 250 సీట్లు ఏర్పడితే, అందులో 200 సీట్లు సంపాదిస్తామని, అసెంబ్లీలో రౌడీయిజం తప్ప జగన్ కు ఏమి తెలియదని, ఈ విషయాలన్నీ రోజా గారు గుర్తు పెట్టుకోవాలంటూ” సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.



