ఏపీలో జరిగిన తాజా రాజకీయ పరిణామాలతో ఒకప్పటి తెలంగాణా టిడిపి నేతలకు అవకాశం లభించినట్లయ్యింది. దీంతో చంద్రబాబును టార్గెట్ చేసుకుని విమర్శలకు దిగుతున్నారు. ఆ క్రమంలోనే టీఆర్ఎస్ క్యాబినెట్ సభ్యుడు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… “చంద్రబాబు నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని, తాను చేస్తే నీతి, ఇతరులు చేస్తే అవినీతా? పార్టీలో చేరిన వాళ్లతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళతారో లేదో వెంటనే చెప్పాలని, వైసీపీ ఎమ్మెల్యేలను ఎంతకు కొన్నారో చెప్పాలని” డిమాండ్ చేశారు.
అయితే ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు వేస్తున్న కౌంటర్లు కోకొల్లలు. అసలు తలసానికి చంద్రబాబును ప్రశ్నించే అర్హతే లేదని, ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే తాము చేసిందేమిటో తెలుస్తుందని… అయినా తలసాని చెప్తున్నట్లుగా చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందే నిజమైతే… పార్టీ మారి చాలా కాలమైన తలసాని ఎంతకు అమ్ముడుపోయారో చెప్తే బాగుంటుందన్న వ్యాఖ్యలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ప్రశ్నలకు జవాబు చెప్పినా, లేకున్నా పరోక్షంగా తానూ అమ్ముడుపోయిన విషయాన్ని తలసాని గారు ఒప్పుకున్నారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. లాజిక్ అయితే కరెక్టే కదా..! మరి ముందుగా తన “మొత్తాన్ని” బయటపెట్టి అందరికీ ఆదర్శప్రాయుడిగా తలసాని నిలుస్తారో లేదో చూద్దాం..!



