బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన “స్పీడున్నోడు” ఆడియో వేడుకకు టాలీవుడ్ హాటెస్ట్ ముద్దుగుమ్మలంతా క్యూలు కట్టారు. అంతేకాదు, ఈ నటీమణులంతా తమ తెలుగు ఉచ్ఛారణతో ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేసారు. ‘స్పీడున్నోడు’ సినిమా టైటిల్ కు బెల్లంకొండ శ్రీనివాస్ సరిగ్గా సూటవుతారని మిల్కీ బ్యూటీ తమన్నా కితాబిచ్చింది. ‘అల్లుడు శీను’ సినిమా చేయకముందే శ్రీనివాస్ తనకు తెలుసని, తను చేసిన డాన్స్ ల వీడియోస్ చూసి ఆశ్చర్యపోయానని, ఈ సినిమాలో అద్భుతమైన డాన్సులు, ఫైట్లు, నటన చూపించిన శ్రీనివాస్ అందర్నీ ఆకట్టుకుంటాడని, మా ఇద్దరి కాంభినేషన్ లో ఇది రెండో స్పెషల్ సాంగ్ అని చెప్పిన తమన్నా, అతనితో డాన్స్ చేయడాన్ని ఎంజాయ్ చేసానని చెప్పుకొచ్చింది.
ఇక, మరో బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ… హీరోయిన్లలో రాశిఖన్నా, రెజీనా తనకు మంచి స్నేహితులని, అలాగే, హీరోలంతా కూడా తనకు మంచి ఫ్రెండ్స్ అని చెప్పింది. షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లే వీలుండదు కనుక, ఆ ఒత్తిడిని జయించేందుకు స్నేహితులతో గడపడం అవసరమని, అందరం సరదాగా కలుసుకుని, సంతోషంగా గడుపుతామని చెప్పింది. అలాగే మరో ముద్దుగుమ్మ కేథరీన్ ప్రసంగిస్తూ… టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకడిగా శ్రీనివాస్ ఎదుగుతాడని, ‘అల్లుడు శీను’ సినిమా చూశానని, అద్భుతమైన డ్యాన్స్ లు, నటనతో అలరించాడని అంది. మొత్తమ్మీద శ్రీనివాస్ కు హీరోయిన్ల ఆశీర్వాదం కాస్త ఎక్కువగానే ఉందంటూ నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు.





