తన వాగ్ధాటితో ప్రత్యర్థుల గుండెల్లో మంటలు, ప్రజల మనసుల్లో కోటలు కట్టుకున్న నేత రేవంత్ రెడ్డి. తెలంగాణా ప్రాంతానికి చెందిన వాడైనప్పటికీ, రెండు తెలుగు రాష్ట్రాలలో రేవంత్ కు విశేషమైన సంఖ్యలో అభిమానగణం ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా రేవంత్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ విషయం అమరావతి శంకుస్థాపనకు హాజరైన సమయంలో ప్రస్పుటంగా బయటపడిన విషయం తెలిసిందే. రేవంత్ పేరు పలకగానే సభా ప్రాంగణమంతా ఈలలు, చప్పట్లతో మారుమ్రోగింది.
అంతటి ప్రజాబలం ఉన్న రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణా తెలుగుదేశం పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఫ్లోర్ లీడర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎప్పుడూ ప్రజల మధ్య ఉండే రేవంత్ రెడ్డి, ఇప్పటివరకు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. అయితే తాజాగా ఈ లోటును కూడా భర్తీ చేసారు. ట్విట్టర్ లో అకౌంట్ ఓపెన్ చేసి, పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు ట్వీట్ చేసారు.
“@revanthtdp” పేరుతో గల ఈ ట్విట్టర్ అకౌంట్ ను నేను మరియు నా టీం మెంబర్లు వినియోగిస్తారని మొదటి ట్వీట్ చేసారు. తెలంగాణా తెలుగుదేశం ‘సింహం’గా పిలుచుకునే అభిమాన వర్గం రేవంత్ ట్విట్టర్ ఎంట్రీతో ఉత్సాహంతో ఉరకలేస్తున్నాయి. ఇప్పటివరకు ప్రెస్ మీట్ లతోనే ప్రత్యర్థులను ఏకిపారేసిన రేవంత్ రెడ్డికి తాజాగా ట్విట్టర్ కూడా తోడవ్వడంతో అగ్నికి వాయువు తోడైనట్లేనని అభిమానులు ఉత్సాహంగా చెప్తున్నారు.



