తెలంగాణలో సాధారణ ఎన్నికల తరువాత మొట్టమొదటి సారిగా ఉపఎన్నిక జరుగుతుంది. అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన హుజూర్ నగర్ శాసనసభ నియోజకవర్గానికి ఈ ఉప ఎన్నిక జరుగుతుంది. పిసిసి అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీగా ఎన్నిక అవడంతో ఈ ఉప ఎన్నిక జరగబోతోంది. ఇప్పటికే ఆయన తన భార్య పద్మావతి పేరును అభ్యర్దిగా ప్రకటించి ప్రచారం చేస్తున్నారు.
తెరాస తరపున గత ఎన్నికలలో పోటీచేసి ఓడిపోయిన సైదిరెడ్డినే తిరిగి అభ్యర్ధి గా పార్టీ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ ప్రకటించారు. గత ఎన్నికలలో ఆయన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో సుమారు ఏడువేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. బీజేపీ కూడా అభ్యర్థిని ఫైనల్ చేసే పనిలో ఉంది.
మరోవైపు టీడీపీ ఈ ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కనిపించడం లేదు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణకి ఉత్తమ్ ఫోన్ చేసి మద్దతు అడిగారంటున్నారు. దీనితో టీడీపీ మద్దతు ఇవ్వడం దాదాపుగా ఖాయంగా కనిపిస్తుంది. 2019 ఎన్నికల తరువాత చంద్రబాబు నెలకో తెలంగాణ టీడీపీ మీటింగ్ పెట్టి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు.
తెలంగాణాలో పార్టీని బలోపేతం చేస్తా అని, 2023 నాటికి బలీయమైన శక్తిగా తీర్చిదిద్దుతానని చెబుతున్నారు. అయితే ఇది ఆచరణలో కనిపించడం లేదు. ఇలా ఎన్నికలలో పోటీ చెయ్యకుండా వేరే పార్టీలకు మద్దతు ఇస్తే… పార్టీ ఎలా బ్రతుకుతుంది. క్యాడర్ ఎలా నిలబడుతుంది. మాటలు చెప్పడం తప్పించి పార్టీని తెలంగాణాలో బ్రతికించడానికి ఎటువంటి చర్యలు చేప్పట్టలేదనేది వాస్తవం.





