తమ పార్టీ ఎమ్మెల్యేలను రకరకాలైన ప్రలోభాలకు అధికార పార్టీ గురి చేస్తోందని ఇటీవల టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ తరుణంలో… తాజాగా మరో ఎమ్మెల్యేపై టీఆర్ఎస్ దృష్టి పడిందని, దీనికి ‘ఓటుకు నోటు’ కేసు ఆయుధంగా మారిందని టిడిపి వర్గాల టాక్. పొలిటికల్ వర్గాల్లో వినపడుతున్న కధనం ప్రకారం…
ఓటుకు నోటు కేసులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ వద్దకు రేవంత్ రెడ్డి తీసుకువెళ్లిన డబ్బును జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నుంచి అందిందన్న పక్కా సాక్ష్యాలను సేకరించిన ఏసీబీ అధికారులు మాగంటిని నేడో లేదా రేపో అరెస్ట్ చేస్తారని తెలంగాణా గడ్డ మీద వినపడుతున్న సమాచారం. ఈ కేసులో గతంలో రేవంత్ సహా మరో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను కూడా ఏసీబీ అరెస్ట్ చేసి, డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చారు? అన్న కోణాలపై సమగ్ర దర్యాఫ్తు చేసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాలని తనపై ఒత్తిడి తెస్తూ బెదిరింపులకు దిగుతున్నారని తెలుగుదేశం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కీలక వ్యాఖ్యలు చేసారు. “తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని స్పష్టంగా చెప్పిన మీదట, ఓటుకు నోటు కేసులో ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధమూ లేదని, తాను ఎటువంటి బెదిరింపులకూ భయపడేది లేదని, టీడీపీలో పుట్టిన తాను టీడీపీలోనే కొనసాగుతానని, టీఆర్ఎస్ దుశ్చర్యలను ప్రజలకు వివరిస్తానని తెలిపారు.





