హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థి వేముల రోహిత్ ఘటనలో మరికొన్ని కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఏబీవీపీ చెప్తున్నట్లు రోహిత్ దళితుడు కాదన్న నిజాన్ని, ఆయన తండ్రి మణికుమార్ మీడియా ముందుకొచ్చి చెప్పడంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది.
“తాము దళితులం కాదని బీసీ-ఏ విభాగానికి చెందిన ‘వడ్డెర’ కులస్తులమని చెప్పారు. అంతేకాదు రోహిత్ అసలు పేరు చక్రవర్తి అని, 10వ తరగతి వరకూ ఇదే పేరు ఉండగా, ఆ తర్వాత అతని తల్లి రోహిత్ గా పేరు మార్చిందన్నాడు. రోహిత్ ‘ఎస్సీ మాల’ సర్టిఫికెట్ తీసుకున్న విషయం, తను డిగ్రీలోకి వచ్చేటంత వరకు తెలియదని, ఈ విషయమై తన కొడుకును ప్రశ్నిస్తే, అమ్మ, అమ్మమ్మలే ఈ సర్టిఫికెట్ తీసుకోమన్నారని.., ‘ఎందుకురా ఇది?’ అని మళ్లీ ప్రశ్నిస్తే, ‘చదువుకు మంచిదని వాళ్లు తీసుకోమన్నారని’ సమాధానం చెప్పాడని, తన ఇద్దరు కొడుకులు మెరిట్ విద్యార్థులని… ఈ సర్టిఫికెట్లతో వారికేమవసరముందో తనకు అర్థం కాలేదని మణికుమార్ వాపోయారు.
ప్రస్తుతం తాను సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నానని, తన కొడుకుకి డబ్బులు పంపించడం తప్పా, వేరే విషయాలేవీ తనకు తెలియదని, మిగిలిన విషయాలన్నీ రోహిత్ అమ్మ, అమ్మమ్మకే తెలుసని, 2005లో తాము విడాకులు తీసుకున్నామని, విడాకులు తీసుకోవడం ఇష్టం లేకపోయినా, తన భార్య వాళ్లమ్మ మాట వినడం వల్లే ఇది జరిగిందన్నారు. తాను గురజాల నివాసినని, తనను గుంటూరులో వచ్చి ఉండమనేవారని.. అందుకు తాను ఒప్పుకోకపోవడంతో వేరుపడాల్సి వచ్చిందన్నారు.
“కొడుకు చనిపోయి అమరుడయ్యాడు. బతికుంటే ఒక సైంటిస్టు అయ్యేవాడు, అమెరికా వెళ్లేవాడు” అంటూ ఆవేదన వ్యక్తం చేసిన రోహిత్ తండ్రి, యూనివర్శిటీ యాజమాన్యం 8 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా అంశాన్ని ప్రస్తావిస్తూ, తన కొడుకు ఆత్మహత్య విషయంలో తమకు న్యాయం కావాలి తప్పా, ఉద్యోగం, డబ్బు అవసరం లేదని స్పష్టం చేసారు. ‘కులం’తో సంబంధం లేకుండా న్యాయం జరగాలని మణికుమార్ కోరారు. ఇదిలా ఉండగా, రోహిత్ మృతిపై న్యాయవిచారణకు హెచ్.ఆర్.డీ మినిస్ట్రీ ఆదేశించింది. ఈ కమిటీ మూడు నెలల్లో నివేదిక ఇవ్వనుంది.





