‘పద్మవిభూషణ్’కు రామోజీరావు అర్హులు కాదు!

undavalli comments on ramoji rao padmabhushan awardవైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో ‘ఈనాడు’ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు టార్గెట్ గా ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన సంచలన ఆరోపణలు రాజకీయ విజ్ఞులకు విదితమే. ఈ సమయంలో పలు కేసులు కూడా రామోజీరావుపై నమోదయ్యాయి. అయితే ఇటీవల కాలంలో రామోజీపై తన దూకుడును తగ్గించిన ఉండవల్లి, తాజాగా మరోసారి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.

“ఎన్నో ఆరోపణలు, కేసులు ఎదుర్కొంటున్న రామోజీరావుకు ‘పద్మవిభూషణ్’ పురస్కారం ఎలా ఇస్తారని, తనపై ఉన్న కేసుల నుంచి రామోజీ బయటపడలేదని, ఎందరో ప్రజల నుంచి అక్రమంగా డబ్బు వసూలు చేశారని, ఇందుకు సంబంధించిన కేసులు కోర్టుల్లో విచారణ దశలో ఉన్నాయని” చెప్పిన ఉండవల్లి, ఈ అంశాలన్నింటిని ప్రధాని, రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు.

ADVERTISEMENT

రామోజీరావుకు పురస్కారం ఇవ్వాలని ప్రతిపాదించిన రాష్ట్ర ప్రభుత్వం తీరును కూడా ఉండవల్లి తప్పుబట్టారు. ప్రకటించిన ‘పద్మవిభూషణ్’ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కు తీసుకోవాలని, గతంలో తాను రామోజీరావు బాగోతాలను బయట పెట్టినప్పుడు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్వయంగా విచారణకు ఆదేశించారని, ఇప్పుడు ఆ విచారణ పూర్తి కాకుండానే పురస్కారం ప్రకటించేశారని అంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించిన ఉండవల్లి, గతంలో రామోజీపై విచారణ జరిపించాలని జైట్లీ రాసిన లేఖను మీడియాకు విడుదల చేశారు.

స్వతహా న్యాయవాది అయిన ఉండవల్లి మాటలతో మాయ చేయగలరు. అందుకే వైఎస్సార్ అప్పట్లో రామోజీకి ఎదురుగా ఉండవల్లిని నిల్చోబెట్టారు. ప్రస్తుతం వినిపించిన ఆరోపణలను కూడా అర్ధవంతంగా చేయడంలో సక్సెస్ అయిన ఉండవల్లి, నిజం కాని ఆరోపణల గురించి ప్రస్తావిస్తున్నారు గానీ, ప్రపంచమంతా చర్చించుకునే విధంగా రామోజీ ఫిల్మ్ సిటీని రూపొందించి, తెలుగు వాడి సత్తాను చాటి చెప్పిన రామోజీరావు తీరును ప్రస్తావించక పోవడం అనేది కేవలం రాజకీయ దురుద్దేశామా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అన్నది తెలియాల్సి ఉంది.

ADVERTISEMENT
Latest Stories