నేడు సూపర్స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ‘వారణాశి’ నుంచి మంచి అప్డేట్ వస్తుందని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూశారు. ఊహించినట్లే అప్డేట్ వచ్చింది. రెండు అద్భుతమైన స్టిల్స్ విడుదల చేశారు. ఈ రెండు స్టిల్స్ ఆఫ్రికా షెడ్యూల్లో కిలిమంజారో, మసాయి మారా ప్రాంతాల్లో చిత్రీకరించిన సన్నివేశాల నుంచి ఎంపిక చేసినవి.
ప్రపంచాన్ని చుట్టివచ్చే ఓ సాహస వీరుడు కథ ‘వారణాశి’ అని రాజమౌళి మొదట చెప్పారు. ఆ తర్వాత ఒక నందీశ్వరుడుపై త్రిశూలం పట్టుకొని రౌద్రంగా యుద్ధానికి బయలుదేరినట్లు ఒక స్టిల్ విడుదల చేశారు. ఈ సినిమాలో మహేష్ బాబు శ్రీరాముడుగా కనిపించబోతున్నారని రాజమౌళి స్వయంగా చెప్పారు.
మరోసారి ఆఫ్రికా, అంటార్కిటికాలో షూటింగ్, ప్రళయం, వారణాశి అంటూ మరిన్ని కొత్త విషయాలు చెప్పారు. చక్రాల కుర్చీలో నుంచి కదల్లేని స్థితిలో విలన్.. కుంభగా పృద్విరాజ్ సుకుమారన్ పరిచయం కూడా ఆసక్తికరంగానే ఉంది. రామాయణంలో కుంభకర్ణుడే ఈ విలన్ కుంభ అంటూ వినిపించిన గాసిప్స్ వారణాశిని మరింత ఆసక్తికరంగా మార్చేశాయి.
ఇప్పుడు ఆఫ్రికా అడవుల్లో మహేష్ బాబు చిల్ అవుతున్న స్టిల్స్ వేశారు. ఇవన్నీ కలిపి చూస్తున్నప్పుడు ‘వారణాశి’ అసలు కథ ఏమిటనే సస్పెన్స్ రాజమౌళి బాగానే మెయిన్టెయిన్ చేస్తున్నట్లనిపిస్తుంది. కానీ ఆయన చెప్పినట్లుగా వారణాశి కథ చాలా విస్తృతమైనదని స్పష్టమవుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో వారణాశి విడుదలైతే అసలు కథ ఏమిటో తెలుస్తుంది. అంతవరకు ఓపిక పట్టాల్సిందే!




