ఎప్పుడైతే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్థాయిని మరచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భార్యలు, పిల్లల జోలికి వెళ్ళారో, ఆ పార్టీ నేతలు కూడా అదే గొప్ప అనుకుంటున్నారు. అసలు విషయాలు వదిలేసి ప్రజలకు ఏ మాత్రం అవసరం లేని పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపైనే విమర్శలు చేస్తున్నారు. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా అదే రకమైన వ్యాఖ్యలు చేశారు.
“మన నుడి, మన నది. సినిమా టైటిల్లాగా అదిరిపోయింది. ముందు మీ నలుగురు పిల్లలను తెలుగు మీడియంలో చేర్పించి నుడికారాన్ని మొదలు పెట్టాలి. తర్వాత మీకు ప్యాకేజి ఇచ్చే యజమాని కృష్ణా నదిని పూడ్చి నిర్మించిన కరకట్ట నివాసాన్ని తొలగించాలని ఆందోళన చేయాలి. అప్పుడు నదుల రక్షణ సఫలమవుతుంది,” అంటూ ట్వీట్ చేశారు.
మాతృభాషను, మన నదులను రక్షించుకునేందుకు జనసేనాని ‘మన నుడి-మన నది’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే..దీనిలో భాగంగా ‘మన నుడి-మన నది’ అవశ్యకతను వివరిస్తూ ట్విట్టర్ లో ఆయన ట్విట్స్ చేస్తున్నారు.. ఈ నేపథ్యంలో ‘మన నుడి-మన నది’ ఉద్యమానికి మీ అమూల్యమైన సలహాలు ఇవ్వండి అంటూ సోషల్ మీడియాలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచీకరణ నేపథ్యంలో జాగ్రత్త పడకపోతే తెలుగుభాష అంతరించిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే జలవనరుల కోసం మన నదులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయడ్డారు. రాజకీయాలకు అతీతమైన సబ్జెక్టు మీద కూడా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు విమర్శలు చెయ్యడం శోచనీయం.





