ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 100 రోజుల ప్రభుత్వంలో అత్యంత వివాదాస్పద నిర్ణయం పేదలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు మూసివెయ్యడం. మళ్ళీ తెరుస్తామని, పేరు మారుస్తామని రకరకాలు చెప్పినా ప్రస్తుతానికి వాటి జాడ లేదు. ఇది ఇలా ఉండగా ఈ విషయంగా సోషల్ మీడియా వేదికగా మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి లోకేష్పై విరుచుకుపడ్డారు వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి… ఓవైపు గత ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూనే.. మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ప్రశంసలు జల్లు కురిపించారు.
వరుస ట్వీట్లు చేసిన సాయిరెడ్డి… “పేదల అన్నం ముద్దలో కూడా తండ్రి, కొడుకులు కమిషన్లు తిన్నారు. 203అన్న క్యాంటీన్ల నిర్మాణంలో రూ.53 కోట్ల అవినీతి జరిగినట్టు విచారణలో తేలింది. 2 కాంట్రాక్టు సంస్థలతో వాటాలు మాట్లాడుకొని వాటికే పనులు దక్కేలా టెండర్లు రూపొందించారు. చదరపు అడుగుకు రూ 4,500 ఖర్చవుతుందా? చంద్రబాబు గారూ? నారా లోకేష్” అంటూ ప్రశ్నించారు. సరే అన్నా క్యాంటీన్లలో అవినీతి జరిగిందనుకుందాం…. దానికి మూసివెయ్యడమే పరిష్కారమా?
అవినీతి జరిగి ఉంటే దానిని వెలికి తీసి బాధ్యులను శిక్షించాలి. ప్రజలకు ముఖ్యంగా పేద ప్రజల కడుపు నింపే కార్యక్రమాన్ని ఆపేయడం ఏంటో? ఒకవేళ ప్రజావేదిక లాగా అవినీతి సొమ్ము అని అన్నా క్యాంటీన్లను కూడా కూల్చివెయ్యరు కదా అని కొందరు సోషల్ మీడియాలో ఎద్దేవా చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 200 అన్నా క్యాంటీన్లు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మూతపడ్డాయి. పేదలకు మూడు పూట్లా కేవలం 15 రూపాయలకే (ఒక్క పూటకు ఐదు రూపాయిలు) కడుపునింపుకునే అవకాశం లేకుండా పోయింది.





