విజయవాడలో జనసేన కార్యాలయంలో విజయవాడ పార్లమెంట్ పరిధిలోని నేతలతో సమావేశమైన పవన్ కళ్యాణ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీని తమ పార్టీలో కలిపేయాలంటూ ఒక పెద్ద పార్టీ తనపై ఒత్తిడి తీసుకువస్తోందని ఆయన వెల్లడించారు. అయితే, జనసేనను ఏ పార్టీలోనూ విలీనం చేసేది లేదని పవన్ స్పష్టం చేశారు. జాతి సమగ్రతని కాపాడటానికి, మానవతా విలువల కోసం పెట్టిన పార్టీ జనసేన అని.. అందుకే జనసేనను ఏ పార్టీలోనూ కలపబోనని పవన్ తేల్చి చెప్పారు.
ప్రస్తుతం రాజకీయ ముఖచిత్రం బట్టి అటువంటి ఆఫర్ ఇచ్చి పవన్ కళ్యాణ్ ను ఒత్తిడి చెయ్యగలిగింది ఒక్క బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు మాత్రమే. జగన్ కు పవన్ కళ్యాణ్ కు ఉన్న విబేధాల కారణంగా వైఎస్సార్ కాంగ్రెస్ అటువంటి ప్రతిపాదన చేసింది అంటే నమ్మడానికి లేదు…. ఇక బీజేపీకి మాత్రమే ఆ అవకాశం, అవసరం ఉంది. చాలా కాలంగా కమలనాథులు జనసేనతో పొత్తుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రత్యేక హోదా వల్ల అది జరగలేదు. వచ్చే ఎన్నికల నాటికీ ఆ అంశం మరుగున పడిపోతుందని కమలనాధులు భావిస్తున్నారు.
ఇప్పుడు రెండో సారి సొంతంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ అత్యంత శక్తివంతంగా మారిపోయారు. పైగా ఆ పార్టీ నేతలు రాష్ట్రంలో ఎదగడం కోసం ఇప్పటికే అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. ఈ క్రమంలో కచ్చితంగా బీజేపీనే పవన్ కళ్యాణ్ పై ఒత్తిడి చేసి ఉండవచ్చు. జనసేనకు ఇటీవలే ఎన్నికలలో ఒకే ఒక్క సీటు వచ్చింది. పవన్ కళ్యాణ్ కూడా తాను పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు ఈ తరుణంలో ఆయనను ఒత్తిడి చేసి విలీనానికి ఒప్పించాలని మోడీ అమిత్ షాల వ్యూహంగా కనిపిస్తుంది.





