అందరూ ముక్తకంఠంతో ఖండించాల్సిన తుని ఘటనపై ఒక ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న వైసీపీ అధినేత జగన్ ఎందుకు స్పందించలేదు? వర్తమాన రాజకీయ అంశాలకు దూరంగా ఎక్కడో కేరళలో “సర్ధార్ గబ్బర్ సింగ్” షూటింగ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ షూటింగ్ కాన్సిల్ చేసుకుని, హటాత్తుగా మీడియా ముందుకు వస్తున్న తరుణంలో హైదరాబాద్ లో ఉన్న జగన్ ఈ ఘటనపై ఎందుకు తన అభిప్రాయం చెప్పలేకపోయారు.
అంటే చంద్రబాబు ఆరోపిస్తున్నట్లుగా ఈ ఘటన వెనుక జగన్ హస్తముందా? కులాల పేరుతో రాజకీయ లబ్ది కోసం జగన్ ఎంతటికైనా తెగిస్తారా? అన్న ప్రశ్నలు సామాన్యులనే కాదు, ఇంతకాలం జగన్ ను గుడ్డిగా నమ్మిన అభిమానులను కూడా కలిచివేస్తున్నాయి. అభివృద్ధి కోసం పరుగులు పెట్టాల్సిన నేటి తరుణంలో కులాల పేరుతో చిచ్చు రాజేసి, తద్వారా ఏం ప్రయోజనం పొందాలని జగన్ ఆశిస్తున్నారు? ముఖ్యమంత్రి పదవి కోసం ఇంత హీనమైన చర్యలకు దిగుతారా? ఇలా అనేకానేక ప్రశ్నలు ఇటు సోషల్ మీడియాలోనూ, అటు సామాన్య ప్రజల్లోనూ చర్చనీయాంశమయ్యాయి.
ఇక, ప్రస్తుతం స్పందించినా విశ్వసించే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరన్నది విశ్లేషకుల భావన. ఎందుకంటే, రాష్ట్రంలో ఏ చిన్న ఘటన జరిగినా, వెంటనే ప్రెస్ మీట్ పెట్టి అధికార పక్షాన్ని విమర్శించి, వారిని ఓదార్చడానికి బయలుదేరే జగన్, ఈ ఉదంతం జరిగి ఇన్ని గంటలైనా స్పందించకపోవడంతో, జగన్ పై వస్తున్న ఆరోపణలను సగటు ప్రజలు నమ్మే పరిస్థితికి వచ్చింది. రాజకీయాల్లో అరాచక శక్తుల ఎంట్రీని ప్రజలు కూడా హర్షించరన్న భావనను రాజకీయ నేతలు కూడా అర్ధం చేసుకుని ప్రవర్తిస్తే, ఇలాంటి ఘటనలకు ఆస్కారం ఉండదని గుర్తుపెట్టుకోవాలి.





