ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రోశయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న సమయంలో జగన్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనమయ్యాయి. అంతేకాదు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో కయ్యానికి కాలు దువ్వినట్లుగా ఉన్న జగన్ పోకడ, రాజకీయ పండితులనే ఆశ్చర్యపరిచింది. అయితే, అంతలా జగన్ చెలరేగిపోవడానికి కారణం… ఆయన వెనుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల, ఎంపీల బలం.
తానూ కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు వచ్చిన మరుక్షణం ఈ ప్రభుత్వం కూలిపోతుందని, తన వెంట దాదాపు 100కు పైగా ఎమ్మెల్యేల బలం, బలగం ఉందని పలు సందర్భాలలో జగన్ చెప్పిన విషయం విజ్ఞులకు విదితమే. అయితే, ఆ తర్వాత జగన్ బయటకు రావడం జరిగింది కానీ, ప్రభుత్వం కూలడం మాత్రం కాదు. ఒకేసారి కాకుండా విడతల వారీగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వైసీపీలోకి ప్రోత్సహించిన జగన్, చివరికి 18 మందిని తన చెంత చేర్చుకోగలిగారు. 100 నుండి 18 వరకు ఎలా పడిపోయింది అన్న విషయం… రానూ రానూ అందరికీ తెలిసి వచ్చింది. అలా జగన్ చేసిన “ప్రగల్భాలు” అంతిమంగా జగన్ ను జైలు పాలు చేసింది.
అయితే గత అనుభవాల నుండి జగన్ పాఠాలు నేర్చుకుంటారని భావిస్తే పొరపాటే అవుతుంది అనే విధంగా తాజాగా జగన్ చేసిన వ్యాఖ్యలు అవేలెండి… ప్రగల్భాలు నిలిచాయి. తనతో 21 మంది అధికార పక్షం నేతలు టచ్, గంటలో ప్రభుత్వం కూల్చివేత… ఇలా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా జగన్ చేసిన వ్యాఖ్యలు తెలిసినవే. మరి ఈ ప్రగల్భాల పర్యవసానాలు కూడా జగన్ అనుభవిస్తున్నారు మరి. అయితే ఇది కేవలం పార్టీ నేతల మార్పు వరకే పరిమితం అవుతుందా లేక గతంలో మాదిరి జైలు జీవితం వరకు తీసుకెళ్తుందా అన్న విశ్లేషణలు ఊపందుకున్నాయి.
ముఖ్యంగా జగన్ ఢిల్లీ పర్యటన ఈ రకమైన చర్చలకు తావిచ్చింది. ఏపీ అభివృద్ధి కోసమే కేంద్ర మంత్రులతో, రాష్ట్రపతితో భేటీ అయ్యాయని చెప్తున్న జగన్ మాటల వెనుక… అసలు భయం మార్చిలో జరగనున్న ఈడీ విచారణే అని పొలిటికల్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే… ప్రస్తుత రాజకీయ పరిస్తితులను నిశితంగా పరిశీలిస్తున్న వారు మాత్రం… ‘అడుసు తోక్కనేలా… కాలు కడగనేలా…’ అంటూ ‘ప్రగల్భాలు పలకనేలా… నెత్తిపై తెచ్చుకోనేలా…’ అంటూ విశ్లేషిస్తున్నారు.



