
ఈ 5 ఏళ్ళలో జగన్, వైసీపి నేతలు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది. జగన్ దూకుడు చూస్తే ఎన్నికల నాటికి టిడిపి ఉంటుందా లేదా? అనే అనుమానం కలిగింది. టిడిపిని రాజకీయంగా దెబ్బ తీయడానికి జగన్ ఏమేమీ చేయాలో అన్నీ చేశారు. ఒకవేళ ఆయన ప్రయత్నాలు ఫలించి ఉంటే టిడిపి మాత్రమే కాదు… జనసేన కూడా లేకుండా పోయేదంటే అభిమానులకు కోపం రావచ్చు. కానీ అది వాస్తవం.
ఓ పక్క టిడిపిని నిర్వీర్యం చేయడానికి సకల ప్రయత్నాలు చేస్తూనే, మరో పక్క వైసీపి కోసం సంక్షేమ పధకాల పేరుతో పెద్ద ఎత్తున ఓట్లు సంపాదించుకునే ప్రయత్నం చేశారు. సాధారణంగా రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలోనే ఓటర్లకు డబ్బులు పంచి ప్రలోభపెట్టి ఓట్లు దండుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి.
కానీ జగన్ చాలా తెలివిగా ఈ 5 ఏళ్ళుగా ప్రభుత్వధనం పంచిపెడుతూ ఓట్లు దండుకునేందుకు పెద్ద స్కెచ్ వేసి చివరి వరకు విజయవంతంగా అమలుచేశారు. అందుకే ఇప్పుడు ఎన్నికల సంఘం అడ్డుకుంటే ‘నా గొంతు నొక్కేస్తున్నారంటూ’ జగన్ గగ్గోలు పెడుతున్నారనుకోవచ్చు.
కానీ , జనసేన, బీజేపీలు కూడా అనేక సంక్షేమ పధకాలు ప్రకటించాయి కదా?అంటే అవును నిజమే. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ పధకాలతో వైసీపిని గెలిపించాలని అనుకుంటున్నప్పుడు, ప్రతిపక్షాలు చేతులు ముడుచుకొని చూస్తూ ఊరుకోలేవు కదా?
కనుక అవి కూడా పోటీ పడి ప్రకటించాల్సి వచ్చింది. అయితే జగన్ ప్రభుత్వంలాగ వాటి కోసం అప్పులు చేయకుండా రాష్ట్రాభివృద్ధి ద్వారా ఆదాయ మార్గాలను పెంచుకొని, కొత్తవి సృష్టించుకొని వాటితో వచ్చే సంపదని సంక్షేమ పధకాలకు వినియోగిస్తామని చంద్రబాబు నాయుడు పదేపదే చెపుతుండటం అందరూ గమనించే ఉంటారు.
జగన్ సంక్షేమ పధకాల కోసం చేసిన అప్పుల వలన రాష్ట్రం దివాళా స్థితికి చేరుకుంటే, చంద్రబాబు సంక్షేమ పధకాల కోసం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెపుతున్నారు. ఇద్దరి ఆలోచనలు, విధానాలలో ఎంత తేడా ఉందో గ్రహించేందుకు ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏముంటుంది?
కానీ ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఈ ఎన్నికల సమయంలో వైసీపికి ఇబ్బందికరమైన అమరావతి, మూడు రాజధానులు, విశాఖ రాజధాని, పోలవరం ప్రాజెక్టు, ఋషికొండ ప్యాలస్ వంటి అంశాలపై ప్రతిపక్షాలు మాట్లాడకుండా, జగన్ వాటిని బాగానే పక్కదారి పట్టించగలిగారు.
ఒకవేళ ప్రతిపక్ష కూటమి ఈ అంశాల గురించి గట్టిగా మాట్లాడి ఉండి ఉంటే ఈ ఎన్నికలలో వైసీపి తుడిచిపెట్టుకుపోయేదే. కానీ ప్రతిపక్షాలు కూడా వైసీపితో పోటీ పడుతూ సంక్షేమ పధకాలు ప్రకటించి, వాటి గురించే ఎక్కువ మాట్లాడేలా చేసిన ఘనత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిదే కదా?
కానీ జగన్ 5 ఏళ్ళుగా ఇంత చక్కగా ప్లాన్ చేసుకొని అన్నీ ఇంత పకడ్బందీగా అమలుచేస్తున్నా, చివరి 15-20 రోజులలో రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి, జనసేన, బీజేపీలకు అనుకూల వాతావరణం ఏర్పడటం బహుశః జగన్ కూడా ఊహించి ఉండరు.
వాలంటీర్లు, సచివాలయాలు, సంక్షేమ పధకాలతో సహా ఏ ఒక్కటీ ఆయనకు ఉపకరిస్తున్నట్లు లేదు. చూడబోతే జగన్ కురుక్షేత్రంలో పద్మవ్యూహం ఛేదించబోయి, చివరికి కర్ణుడిలా నిసహాయంగా మిగిలిపోయిన్నట్లు కనబడుతున్నారు.
కర్ణుడి వీరయోధుడే కానీ శాపగ్రస్తుడు. కనుక వీరమరణం పొందాడు. జగన్ స్వయంకృతాపరాధాలే ఆయన పాలిట శాపాలుగా మారి ఈ కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఆయనతో పాటు వైసీపిలో అందరినీ కూడా బలిగొనబోతున్నట్లు కనిపిస్తోంది.
Actor Aamir Khan and director Ashutosh Gowariker are reuniting after 25 years for a new…
A major broadcast error during the first Test match between Pakistan and Bangladesh has gone…