ఎన్నికలకు కొన్ని రోజుల ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడు శ్రీనివాసులరెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కడప ఆసుపత్రిలో చికిత్సపొందుతూ శ్రీనివాసులరెడ్డి అనే నిందితుడు మృతి చెందాడు. పోలీసుల వేధింపుల తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు శ్రీనివాసులరెడ్డి సూసైడ్నోట్లో పేర్కొన్నాడు. వివేకా హత్యకేసుతో తనకు సంబంధం లేదంటూ లేఖలో వాపోయాడు.
శ్రీనివాసులరెడ్డి బావ పరమేశ్వరరెడ్డి కూడా ఈ కేసులో నిందితుడే. కాసేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడుతూ… 30 సంవత్సరాలు వైఎస్ జగన్ కుటుంబానికి సేవ చేస్తున్నా, తనను తన బావని ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేకపోయినా పోలీసులు నరకయాతన పెడుతున్నారని కన్నీటిపర్యంతం అయ్యారు. గతంలో పరిటాల రవి హత్యకేసులో కూడా ఇలాగే ఒక హత్యను కప్పిపుచ్చడానికి మరో హత్య, దానిని కప్పి పుచ్చడానికి ఇంకో హత్య అలా హత్యలు జరుగుతూనే ఉండేవి.
ఇప్పుడు వివేకా కేసులో కూడా అలాగే జరుగుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎన్నికల ముందు టీడీపీ పై ఆరోపణలు చేసి, సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేశారు జగన్ అయితే ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చి అటువంటి ప్రయత్నాలు ఏమీ చెయ్యలేదు. ఇప్పుడు ఈ ఆత్మహత్య తరువాత ఈ కేసుపై మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు నిన్న పులివెందుల పర్యటనకు వెళ్ళిన ముఖ్యమంత్రి అక్కడ వైఎస్ వివేకానందరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కారించారు.



