సార్వత్రిక ఎన్నికలు జరిగి దాదాపు రెండు సంవత్సరాలు ముగుస్తున్న తరుణంలో వైసీపీ నుండి ఒకేసారి “నాలుగు” వికెట్లు నేలకూలాయి. ‘మునిగిపోయే నావలోకి ఎవరు వెళ్తారు? ఒక్క వైసీపీ ఎమ్మెల్యే కూడా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళరు’ అంటూ పార్టీ అధినేత జగన్ తో సహా ఎమ్మెల్యే రోజా వంటి వారు చేసిన వ్యాఖ్యలు అవగాహనా రాహిత్యమేనని తేలిపోయింది. కేవలం ప్రగల్భాల వరకే జగన్ వర్గపు మాటలు అన్న విషయం స్పష్టం కావడంతో, ప్రస్తుతం ఉన్న “నాలుగు” సంఖ్య ఎక్కడి వరకు వెళ్తుందో అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
అయితే ఈ సంఖ్య ఎంతవరకు చేరుతుందో మున్ముందు మీరే చూస్తారు అంటున్నారు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి. ‘పసుపు’ కండువా కప్పుకున్న సందర్భంగా ప్రసంగించిన ఆది, “ఇక, తిరుగుబాటు మొదలైంది, ఇలా పార్టీలోకి వచ్చేవారు చాలా మందే ఉన్నారు, ఎవరు ఎప్పుడు వస్తారో మీకే తెలుస్తుంది” అంటూ చేసిన వ్యాఖ్యలు వైసీపీలో నెక్స్ట్ వికెట్ ఎవరిదన్న విషయంపై ఆసక్తిని పెంచుతోంది. తమతో పాటు వచ్చే వారు చాలా మంది అంటూ పేర్లు చెప్పకుండా వదిలివేయడంతో ప్రస్తుతం వైసీపీ కార్యకలాపాలకు కాస్త దూరంగా ఉంటున్న వారందరి పేర్లు హల్చల్ చేస్తున్నాయి.
చూడబోతుంటే… జగన్ పై వైసీపీ దండు “తిరుగుబాటు” మొదలైనట్లే కనపడుతోంది. ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలను పరిశీలిస్తే… నిజానికి ఎప్పుడో టిడిపిలోకి రావాల్సి ఉంది. కానీ, ఆలస్యమైంది అంటే… ఇప్పటివరకు ఉపేక్షించే ధోరణిలో చంద్రబాబు ఉండి ఉంటారని, కానీ, “ఒక్క గంటలో ప్రభుత్వాన్ని పడగొడతాను” అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలతో తేనెతుట్ట కదిలిందని, ఇక వైసీపీ పరిస్థితి “కుక్కలు చింపిన విస్తరి” మాదిరి మారిపోతుందని రాజకీయ వర్గాల్లో అంచనాలు, విశ్లేషణలు ఊపందుకున్నాయి. ఈ నలుగురితో మొదలైన వైసీపీ దండు “తిరుగుబాటు” ఎంతవరకు వెళ్తుందో చూడాలి? ఎనీ గెస్..!



