
వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి ‘చొక్కా మడత పెట్టి యుద్ధానికి సిద్ధం’ అని చెప్పడం ద్వారా ఆయన పోలింగ్ ఏవిదంగా జరగాలని కోరుకుంటున్నారో వైసీపి శ్రేణులకు సూచించారు.
కానీ పోలింగ్కు ముందు ‘ఈసారి ఎన్నికలు సక్రమంగా జరుగుతాయనే నమ్మకం సన్నగిల్లిపోతోందని’ చెప్పినప్పుడు అందరూ ఆయన ఓటమిని అంగీకరించారనుకున్నారు. కానీ పోలింగ్ ఏవిదంగా జరగాలో ఆయన మరోసారి వైసీపి శ్రేణులకు చేసిన తుది హెచ్చరికగా కూడా దానిని చూడవచ్చు. బహుశః ఆ హెచ్చరిక ఫలితమే నిన్న పలు జిల్లాలలో అల్లర్లు, దాడులని భావించవచ్చు.
కానీ వైసీపి ఓటమి ఈ పోలింగ్ కంటే ముందే రాష్ట్రంలో ‘సైలంట్ ఓట్’ అదే… ‘పోస్టల్ బ్యాలట్’తోనే మొదలైందని చెప్పవచ్చు. మొత్తం 4.44 లక్షల మంది ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓట్లు వేశారు. ఈ 5 ఏళ్ళుగా జగన్ ప్రభుత్వం వారందరికీ నరకం చూపించింది. కనుక వారిలో 90 శాతం మంది కూటమికే ఓట్లు వేస్తారనే దానిలో ఎటువంటి సందేహం లేదు.
పోస్టల్ బ్యాలట్ కేవలం వారి ఓట్లకే పరిమితం కాదు. వారి కుటుంబాలు కూడా జగన్ ప్రభుత్వ బాధితులే. కనుక తక్కువలో తక్కువ ఒక్కో ఇంట్లో 3-4 ఓట్లే ఉన్నాయనుకున్నా అవన్నీ కలిపి మరో 15-20 లక్షలు ఓట్లు కూటమికే పడతాయి.
రాష్ట్రంలో ఈసారి ఏ నోట విన్నా ‘మార్పు తప్పదు’ అని వినిపించింది. అమరావతి, చంద్రబాబు నాయుడు అరెస్ట్, మద్యం, గంజాయి, భూకబ్జాలు, ఇసుక, మట్టి, కొండలు, గుట్టలు దోపిడీ, ముఖ్యంగా రాష్ట్రంలో అరాచక పరిస్థితులు, రౌడీఇజం వంటివి రాష్ట్రంలో ఒక్కో వర్గం ప్రజలను చాలా తీవ్రంగా ప్రభావితం చేశాయని చెప్పవచ్చు.
ఈ ఎన్నికలు పెత్తందారులకు, పేద ప్రజలకు మద్య అని జగన్ చెప్పుకున్నప్పటికీ, ఇవి జగన్ ప్రభుత్వానికి-ప్రజలకు మద్య, అభివృద్ధికి-సంక్షేమ పధకాలకు మద్య, ఇంకా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు- జగన్మోహన్ రెడ్డిల మద్య జరుగుతున్నవిగానే ప్రజలు చూశారు.
అందుకే ఈసారి ఇంతభారీగా జనం తరలివచ్చి ఓట్లు వేశారు. ఒకవేళ జగన్ చెప్పుకుంటున్నట్లు సంక్షేమ పధకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నట్లయితే, సంతృప్తి చెందిన్నట్లయితే ఈసారి 175 సీట్లు వైసీపి గెలుచుకోవాలి. కానీ ఈసారి కూటమి 115-120కి పైగా సీట్లు గెలుచుకొని అధికారంలోకి రాబోతోందని సర్వేలన్నీ సూచిస్తున్నాయి.
ఒకవేళ సర్వేలన్నీ తప్పు, ఎల్లో మీడియావన్నీ కాకి లెక్కలే అని అనుకున్నా నిన్న ఓట్లు వేయడానికి వచ్చిన జనాలను చూస్తే వైసీపి ఓటమి ఖాయమని తెలిసిపోతోంది. ఏవిదంగా అంటే, ఈసారి పోలింగ్ 80శాతం దాటే అవకాశం ఉంది. వారిలో సంక్షేమ పధకాలు పొందుతున్న ఓ 20-25 శాతం, వైసీపి, రెడ్డి, క్రీస్టియన్, దళిత సామాజిక వర్గాలకు చెందిన మరో 15-20 శాతం మంది వైసీపికే ఓట్లు వేశారనుకున్నా మిగిలిన 50-55 శాతం ప్రజలు కూటమికే వేస్తారు.
కనుక గత ఎన్నికలలో వైసీపి ఏవిదంగా భారీ మెజార్టీతో గెలిచి రికార్డు సృష్టించిందో, అదేవిదంగా ఈసారి ఘోర పరాజయంతో మరో సరికొత్త రికార్డు సృష్టించుకోబోతున్నట్లే ఉంది.
ఈసారి 175 సీట్లు గెలుచుకుంటామని చెప్పి రెండోసారే అధికారంలోకి రాలేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఇంతకంటే అవమానం మరొకటి ఉండదు. ఏది ఏమైనప్పటికీ ఈ ఎన్నికల ఫలితాలు జగన్ ఇమేజ్కి, ఆయన పాలన, విధానాలు, నిర్ణయాలకు రిఫరెండంగానే భావించవచ్చు.
Actor Aamir Khan and director Ashutosh Gowariker are reuniting after 25 years for a new…
A major broadcast error during the first Test match between Pakistan and Bangladesh has gone…