ఏపీలో అభివృద్ధి శంకుస్థాపనలు వడివడిగా జరుగుతున్నాయి. నవ్యాంధ్ర రాజధాని అమరావతి మొదలు వ్యవసాయ యూనివర్సిటీ, నిట్, దుర్గ గుడి ఫ్లై ఓవర్, బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్, విజయవాడ – మచిలీపట్టణం జాతీయ రహదారి విస్తరణ వంటి తదితర కార్యక్రమాలకు ఇప్పటికే శంకుస్థాపన జరిగింది. అలాగే మరికొన్ని పైప్ లైన్ లో ఉన్నాయి. ఈ జాబితాలో ముందుగా ‘ఎయిమ్స్’ సంస్థ శంకుస్థాపన జరుపుకోనుంది.
ఈ నెల 19వ తేదీన మంగళగిరి కేంద్రంగా ‘ఎయిమ్స్’ శంకుస్థాపన జరగనుందని గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతి లాల్ దండే ప్రకటించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పనులన్నీ 16వ తేదీకల్లా పూర్తి కావాలని అధికారులకు ఆదేశించారు. మంగళగిరిలో ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించిన నాటి నుండి ఎన్నో అడ్డంకులు, మరెన్నో ట్విస్టులు. వీటన్నింటి మధ్య ఎట్టకేలకు ‘ఎయిమ్స్’ శంకుస్థాపన జరుపుకోనుండడం పట్ల పట్ల స్థానిక ప్రజలు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు.
మంగళగిరి నుండి ‘ఎయిమ్స్’ను దూరం చేయడానికి కొన్ని రాజకీయ శక్తులు తీవ్రంగా ప్రయత్నించాయని, దీనికి భూమి లభ్యతను సాకుగా చూపించారని పొలిటికల్ & మీడియా వర్గాల్లో ప్రచారంలో ఉన్న విషయం. అయితే ఇటీవలే కేంద్ర ప్రభుత్వం మంగళగిరిలో ‘ఎయిమ్స్’ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అడ్డంకులన్నీ తొలగినట్లయ్యింది.





