రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి రాజధాని లేకుండా పోయింది. పదేళ్ళు హైదరాబాద్ని రాజధానిగా షేర్ చేసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ, కేసీఆర్ పుణ్యమాని తెలంగాణలో ఆంధ్రా పాలకులకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది.
అక్కడ ఏ చిన్నపాటి సంఘటన జరిగినా పెద్ద యుద్ధాలే జరుగుతాయి. అందుకే సిఎం చంద్రబాబు నాయుడు, హైదరాబాద్ని వదులుకొని అమరావతిని రాజధానిగా ఎంచుకున్నారు.
హైదరాబాద్ వదులుకోవడంపై మొదట్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ, ఆ తర్వాత అయన నిర్ణయం సరైనదని అందరికీ అర్ధమైంది.
రాష్ట్ర ప్రజలు ఆకాంక్షలు, ఆత్మగౌరవానికి గుర్తింపుగా రాజధాని అమరావతి నిర్మిస్తుంటే ప్రజలు సంతోషిస్తున్నారు. కానీ జగన్ తన రాజధాని విషయంలో తన ఆలోచనలను, అభిప్రాయాలను ప్రజలవిగా అభివర్ణిస్తూ తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉన్నారు.
ఓ పక్క శరవేగంగా అమరావతి నిర్మాణ పనులు సాగుతూ ఒకటొకటిగా సిద్ధమవుతున్నాయి. వాటిలో ఆయన నివాసం ఉండే తాడేపల్లిని కలుపుతూ సాగే సీడ్ యాక్సిస్ రోడ్ కూడా ఒకటి.
అమరావతిని వ్యతిరేకిస్తూనే ఐదేళ్ళపాటు చంద్రబాబు నాయుడు కట్టిన శాసనసభ, సచివాలయం, హైకోర్టులను ఉపయోగించుకున్న జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఈ సీడ్ యాక్సిస్ రోడ్ కూడా వాడుకుంటారు. రేపు భోగాపురం విమానాశ్రయం కూడా వాడుకుంటారు. అయినా వాటి అవసరం, సౌలభ్యం అర్థం కానట్లు వితండవాదం చేస్తుంటారు.
ఈవిధంగా అమరావతిని వ్యతిరేకిస్తున్న ప్రతీ ఒక్కరూ ఒకసారి హైదరాబాద్ను చూడాలి.
ఇప్పటికే పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందిన హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తోంది. మూసీ సుందరీకరణ చేస్తోంది. ఇంకా కొత్తగా ఫ్లైఓవర్లు నిర్మిస్తూనే ఉంది.
ఇన్ని దశాబ్దాల తర్వాత, హైదరాబాద్ నగర తాగునీటి అవసరాల కొరకు రిజర్వాయర్లు నిర్మిస్తోంది. మళ్ళీ కొత్త హైకోర్టు, కొత్త ఉస్మానియా ఆసుపత్రి, టిమ్స్ ఆసుపత్రులు నిర్మిస్తోంది.
దశాబ్దాల కాలంలో అభివృద్ధి చెందిన హైదరాబాద్కే ఇన్ని కొత్త ప్రాజెక్టులు అవసరమైనప్పుడు.. విభజన తర్వాత రాజధాని కూడా లేకుండా మిగిలిన ఆంధ్రప్రదేశ్కు వీటన్నిటితో కూడిన అమరావతి అవసరం లేదా?
చంద్రబాబు నాయుడు అమరావతి విషయంలో మొదటి నుంచీ ఇదే ముందుచూపుతో వ్యవహరించారు. నాడు మొదలుపెట్టిన అమరావతి పనులను అయన శరవేగంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తుంటే.. అందుకు ఆయనని ఎవరు అభినందించకపోయినా పర్వాలేదు. భవిష్యత్లో ప్రతీ ఒక్కరూ తప్పకుండా అయన గురించి గొప్పగా చెప్పుకుంటారు.
అయితే రాజధాని అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు ముందుచూపు, నిబద్దత, చేస్తున్న కృషి, దాని ఫలితాలని రాష్ట్ర ప్రజలకు అర్ధమవుతూనే ఉంది.
కానీ రాజధాని పేరుతో నీచ రాజకీయాలు, విమర్శలు చేస్తుంటే ఎవరికి నష్టం?అని జగన్, వైసీపీ నేతలు ఆలోచించారో లేదో?అమరావతిని వ్యతిరేకిస్తూ దానికి ఆటంకాలు సృష్టించేందుకు తాము చేస్తున్న కుట్రలను ప్రజలు నిశితంగా గమనిస్తూనే ఉన్నారని తెలుసుకోలేనంత అమాయకులు కారు వైసీపీ నేతలు.
కానీ దేవుడి స్క్రిప్ట్ అలా ఉంది కనుక వారు ఆ ప్రకారమే ‘మావిగన్’అంటున్నారు. తద్వారా తమ వేళ్ళతో తమ కళ్ళే పొడుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు వారిపై జాలి కలుగుతుంది.
వచ్చే ఎన్నికల్లో అమరావతిని నిర్మించి చూపిన చంద్రబాబు నాయుడుని మళ్ళీ ఎన్నుకోవాలా లేదా దానిని మళ్ళీ పాడుబెట్టేసి ‘మావిగన్’ అంటున్న జగన్ని ఎన్నుకోవాలా? ప్రజలే నిర్ణయిస్తారు.




