ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఎవరు ఎంతగా వ్యతిరేకిస్తున్నప్పటికీ, ఎంతగా దుష్ప్రచారం చేస్తున్నప్పటికీ, నిర్మాణ పనులు ఆగడం లేదు.
జగన్ హయంలో ఐదేళ్ళపాటు పూర్తిగా నిర్వీర్యం చేయబడిన అమరావతిలో గత రెండేళ్ళుగా రేయింబవళ్ళు శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కనుక అప్పుడే ఒకటొకటిగా ప్రారంభోత్సవాలకు సిద్ధం అవుతున్నాయి.
సిఎం చంద్రబాబు నాయుడు నేడు అమరావతికి అత్యంత కీలకమైన సీడ్ యాక్సిస్ రోడ్, బకింగ్ హామ్ కెనాల్పై నిర్మించిన స్టీల్ బ్రిడ్జిలకు ప్రారంభోత్సవం చేయబోతున్నారు.
ముందుగా స్టీల్ ప్లాంట్ బ్రిడ్జ్ వద్ద అమరావతిని సూచిస్తూ ఇంగ్లీషు అక్షరం ‘ఏ’ ఆకారంలో నిర్మించి పైలాన్ ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత స్టీల్ ప్లాంట్ బ్రిడ్జ్, సీడ్ యాక్సిస్ రోడ్డుని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత రాయపూడి వద్ద నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్స్ పరిశీలిస్తారు.
వాటిని కూడా నేడే ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ సాంకేతిక కారణాల వలన ప్రారంభోత్సవం వాయిదా పడింది. త్వరలోనే వాటి ప్రారంభోత్సవం జరుగుతుంది.
రాబోయే మూడేళ్ళలో అమరావతిలో ఇలాంటి ప్రారంభోత్సవాలు వరుసగా జరుగుతూనే ఉంటాయి. వాటిని చూసి ప్రజలు సంతోషిస్తుంటే, వైసీపీ మాత్రం రక్త కన్నీరు కార్చుతూనే ఉంటుంది.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతి నిర్మాణ పనులు కొనసాగించి ఉండి ఉంటే ఈ క్రెడిట్ అంతా దానికే దక్కి ఉండేది. పైగా ఈ పాటికి అమరావతి నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యి ఉండేవి. అమరావతిలో శిలా ఫలకాలపై ‘సిఎం జగన్మోహన్ రెడ్డి’ పేర్లే ఉండేవి. అప్పుడు సిఎం చంద్రబాబు నాయుడుకి, కూటమి ప్రభుత్వానికి ఇలాంటి అవకాశం లభించి ఉండేదే కాదు కదా?
కానీ జగన్ ఓ గొప్ప అవకాశాన్ని కాలదన్నుకోవడమే కాక, తాను అమితంగా ద్వేషించే చంద్రబాబు నాయుడికే ఈ క్రెడిట్ దక్కేలా చేశారు కూడా. దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదేగా!




