
ఏపీ రాజధాని అమరావతి విషయంలో వైసీపీ వైఖరి ఏమిటో 5 ఏళ్ళ పాలనలోనే తేల్చి చెప్పేశారు. వచ్చే ఎన్నికల నాటికి అమరావతికి రూపురేఖలు తీసుకువచ్చి చూపిస్తే ప్రజలు మళ్ళీ కూటమినే గెలిపిస్తారు తప్ప దానిని మళ్ళీ పాడుబెట్టేసే వైసీపీకి అధికారం కట్టబెట్టరు కదా? అందువల్లే శరవేగంగా సాగుతున్న అమరావతి నిర్మాణ పనులను చూసి వైసీపీ తీవ్ర ఆందోళనకు గురవడం సహజమే.
ఏపీ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ తీర్మానం చేసేందుకు ఈ నెల 28న ప్రభుత్వం శాసనసభ ప్రత్యేక సమావేశం నిర్వహించబోతోంది.
సాధారణ, బడ్జెట్ శాసనసభ సమావేశాలకు వెళ్ళలేక మొహం చాటేస్తున్న వైసీపీకి ఈ ప్రత్యేక సమావేశం చాలా సంకటమే.
వచ్చి అమరావతికి మద్దతు పలుకలేరు. రాకపోతే నేటికీ అమరావతిని వ్యతిరేకిస్తున్నట్లవుతుంది. కనుక ఈసారి ‘టైగర్ రాంబాబు’ స్థానంలో ‘మేధావి సజ్జల’ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఆయనేమన్నారో క్లుప్తంగా..
1. అమరావతి కోసం శాసనసభ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం, తీర్మానం చేయడం ఓ పెద్ద డ్రామాయే.
2. అమరావతిని ఎవరూ వ్యతిరేకించనప్పుడు తీర్మానం దేనికి? వైసీపీ ఎన్నడూ అమరావతిని రాజధానిగా వద్దనలేదు. అందుకే జగన్ అక్కడే ఇల్లు కట్టుకున్నారు కూడా.
3. అమరావతిపై అంత ఖర్చు దేనికని మాత్రమే మేము అడుగుతున్నాము.
4. అధికార వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులన్నాము. వాటిలో అమరావతి కూడా ఒకటి కదా?
5. అమరావతిని వేగంగా నిర్మించాలనే ఆలోచన చంద్రబాబు నాయుడుకి లేనేలేవు. దీనిని ఓ కామధేనువులా వాడుకోవాలని అనుకుంటున్నారు.
6. ఈ రెండేళ్ళలో అమరావతిలో కొత్తగా ఒక్క భవనం కట్టారా? పాత వాటినే పూర్తి చేసి గొప్పగా చూపించుకుంటున్నారు.
7. మొదట విడత భూములిచ్చిన రైతులకే ఇంత వరకు న్యాయం చేయలేదు. ఇప్పుడు మళ్ళీ రెండో విడత భూసేకరణ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు వలన అమరావతి ప్రాంతంలో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
8. చంద్రబాబు నాయుడు మళ్ళీ అమరావతి పేరుతో రాష్ట్ర ప్రజలకు గ్రాఫిక్స్, మీడియాలో ప్రచారం చేయించుకుంటూ ప్రజలను మభ్య పెడుతున్నారు.
9. అమరావతిపై ఇంకా ఎన్ని లక్షల కోట్లు ఖర్చు చేస్తారు? ఎన్ని దశాబ్దాలలో పూర్తవుతుంది?
ఈ ప్రశ్నలో మొదటి, రెండో విడత భూసేకరణ గురించి సజ్జల చేసిన విమర్శలు మాత్రమే కాస్త సహేతుకంగా కనిపిస్తున్నాయి. కానీ మిగిలిన ప్రశ్నలన్నిటికీ ఆయన జగన్మోహన్ రెడ్డినే సంజాయిషీ అడగాల్సి ఉంటుంది.
అమరావతిని ఎన్నడూ వ్యతిరేకించకపోతే వైసీపీ అధికారంలో ఉన్న 5ఏళ్ళు దానిని ఎందుకు పాడుబెట్టేశారు?పనుల ఆలస్యానికి, దాని వలన కలిగిన నష్టానికి, పెరిగిన అంచనా వ్యయాలకు కారణం ఎవరు? జగనే కదా? రాజధాని కోసం శాసనసభ తీర్మానం చేయాల్సి రావడం జగన్ భయంతోనే కదా?
నిజాం నవాబుల కాలంలోనే హైదరాబాద్ అన్ని విధాల అభివృద్ధి చెందిందని వితండవాదం చేసిన కేసీఆరే నగరాభివృద్ధి పనులకు లక్షల కోట్లు ఖర్చు చేశారు.
తమ హయంలో హైదరాబాద్ పూర్తిగా అభివృద్ధి చెందింది. ఇక కొత్తగా చేయాల్సింది ఏమీ లేదన్నట్లు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంటే, మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మూసీ ప్రక్షాళన వంటి అభివృద్ధి పనులకు లక్షల కోట్లు ఖర్చు చేస్తోంది కదా? ఇంకా రోడ్లు, ఫ్లై ఓవర్లు నిర్మిస్తూనే ఉంది కదా?
మరి గ్రౌండ్ జీరో స్థాయి నుంచి క్వాంటం వ్యాలీ వరకు పక్కా ప్లాన్డ్ సిటీగా అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతి నిర్మించబడుతుంటే వైసీపీ సంతోషించాలి కదా?
కానీ ఎంత ఖర్చవుతుంది? ఎప్పుడు పూర్తవుతుంది?అంటూ సజ్జల ప్రశ్నించడం చాలా హాస్యాస్పదంగా ఉంది.
ఇన్ని మాటలెందుకు? సింపుల్గా “మేము అమరావతికి వ్యతిరేకం. మళ్ళీ ధికారంలోకి వస్తే ఎక్కడి పనులు అక్కడ నిలిపెస్తాం,” అని జగన్ ధైర్యంగా చెప్పేయొచ్చు కదా? ఎవరు కావాలో ప్రజలే నిర్ణయించుకుంటారు కదా?
After the disastrous performance of Ustaad Bhagat Singh, Pawan Kalyan fans have been eagerly waiting…
Two upcoming releases, Dhamaal 4 and Welcome to the Jungle, have changed their release dates.…