హత్య రాజకీయాలు ఎప్పుడూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. పూర్వం నుండి వచ్చిన కుటుంబ నేపధ్యం వలనో లేక పరిటాల రవి హత్య జరిగిన తర్వాత వెల్లువెత్తిన ఆరోపణల వలన కావడమో గానీ, అసెంబ్లీలో ఎప్పుడూ హత్యా రాజకీయాల అంశాలకు వేదిక అవుతారు.
నేడు జరిగిన అసెంబ్లీ సమావేశంలో కూడా జగన్ మాట్లాడుతూ… పరిటాల రవి హత్య కేసులో తనపై లేని పోని ఆరోపణలు చేస్తున్నారని, రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ నేతలు ఈ ఆరోపణలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసి, వంగవీటి రంగాను చంద్రబాబు నాయుడే చంపించారని హరిరామ జోగయ్య పుస్తకం కూడా రాశారని, మరి హత్య వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నారా? లేదా? అంటూ టాపిక్ ను తనపై నుండి మళ్ళించడంలో సక్సెస్ అయ్యారు.
మరోవైపు… అధికార పక్షం నేత విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తన ప్రసంగంలో జగన్ పై నిప్పులు చెరుగుతూ… కడప జిల్లా సింహాద్రిపురం పోలీస్ స్టేషన్ పై 22 ఏళ్ల వయసులోనే దాడి చేసిన చరిత్ర జగన్ సొంతమని, పోలీసులపై చేయి చేసుకున్నారని, ఈ మేరకు జగన్ పై కేసులు కూడా నమోదయ్యాయని, సదరు ఘటనకు సంబంధించి ఆధారాలను కూడా బొండా అసెంబ్లీలో ప్రదర్శించారు. అలాగే పరిటాల రవి హత్య కేసులో జగన్ పై అనేక అభియోగాలు ఉన్నాయని, మొన్న తూర్పుగోదావరి జిల్లా తునిలో జరిగిన కాపు ఐక్య గర్జనలో జరిగిన విధ్వంసానికి జగన్ ఇలాకా పులివెందుల నుంచి వచ్చిన రౌడీలే కారణమని చెప్పడంతో సభ అట్టుడికింది.
ఇలా ఒకరిపై ఒకరు వంగవీటి మోహన రంగా మరియు పరిటాల రవి హత్య ఉదంతాలను ప్రస్తావిస్తూ ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే… వంగవీటి రంగా హత్య కేసులో అసలు చంద్రబాబు పేరు చార్జీషీట్ లో లేకపోగా, హరిరామ జోగయ్య పుస్తకం ముందు వరకు అసలు రాజకీయాల్లో లేని అంశం. మరో వైపు పరిటాల రవి హత్య కేసులో మొదటి నుండి వైయస్ జగన్ పై తీవ్ర ఆరోపణలు వ్యక్తమయ్యాయి. అయితే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సిబిఐ జగన్ కు ‘క్లియరెన్స్’ ఇచ్చిన విషయం తెలిసిందే.





