ఆంధ్రా అభివృద్ధి చెందుతుంటే సంతోషించాలి కానీ…

Andhra development project inauguration

ఆంధ్రప్రదేశ్‌లో సామాన్య ప్రజలు కూడా రాష్ట్రాభివృద్ధిని చూసి సంతోషిస్తుంటే, ఐదేళ్ళు రాష్ట్రాన్ని పాలించిన వైసీపీ నిత్యం విలపిస్తుండటం విచిత్రం. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అట్టహాసంగా ప్రారంభోత్సవం జరుగుతున్నప్పుడు వైసీపీ కన్నీటి వరదని పోలవరం కూడా సరిపోదేమో?

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు ఇలా విలపించే బదులు ప్రజలు తమకు అధికారం కట్టబెట్టినప్పుడే ఇలాంటి అభివృద్ధి పనులు పూర్తిచేసి ఆ క్రెడిట్ క్లెయిమ్‌ చేసుకోవచ్చు కదా?

ADVERTISEMENT

హైదరాబాద్‌ హైటెక్ సిటీ, ఐటి కంపెనీల గురించి సిఎం చంద్రబాబు నాయుడు సగర్వంగా చెప్పుకుంటున్నట్లు, జగన్‌ కూడా అమరావతి, పోలవరం వగైరా పూర్తిచేసి గొప్పగా చెప్పుకోవచ్చు కదా.. ఎవరు వద్దన్నారు?

కానీ వాటిని పక్కన పడేసి విమానాశ్రయం మొదలు పెట్టారు. ఎందుకు? కారణాలు అందరికీ తెలుసు.

అయినా తమలాగే సిఎం చంద్రబాబు నాయుడు చేతులు ఎత్తేయకుండా రెండేళ్ళలో పూర్తి చేసి ప్రారంభోత్సవం చేసినందుకు సంతోషించాలి కానీ కడుపు మంట, కన్నీళ్ళు దేనికి?

అసలు ఇలా మాట్లాడుతూ ఏం సాధించాలని భావిస్తున్నారు? అందుకు ప్రజలు ఏమనుకుంటున్నారు? అని ఒకసారి ఆలోచిస్తే బాగుండేది.

ఇక ఈ కార్యక్రమంలో సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌, పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నలుగురూ పోటీ పడి మరీ ప్రధాని మోడీని ప్రసన్నం చేసుకునేందుకు ఆరాట పడ్డారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.

అవును నిజమే. కానీ రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్న ప్రధాని మోడీ, ఇలాంటి కార్యక్రమానికి మన అతిధిగా రాష్ట్రానికి వస్తే ఆయన గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడితే తప్పేమిటి?అందువల్ల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మరి కొంత మేలే జరుగుతుంది కానీ నష్టం జరుగదు కదా?

మాజీ సిఎం కేసీఆర్‌ ప్రధాని మోడీపై కత్తులు దూసినందుకు తెలంగాణ ఏర్పడి 12 ఏళ్ళవుతున్నా నేటికీ ఆ రాష్ట్రంలో కొత్తగా ఒక్క విమానాశ్రయం రాలేదు. కానీ ప్రధాని మోడీతో సఖ్యతగా ఉన్నందుకు ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా పోర్టులు, ఎయిర్ పోర్టులు వస్తున్నాయి కదా?

గత వైసీపీ ప్రభుత్వ హయంలో సంక్షేమ పధకాల ప్రచారం కోసం, జగన్‌ ఫోటోలు, పేర్ల కోసమే వేల కోట్లు ఖర్చు చేసినప్పుడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికే గర్వకారణమైన ఇలాంటి కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించుకోవడం తప్పా?

ఒకప్పుడు ప్రజలు, పార్టీలు, ప్రభుత్వాలు కూడా రాష్ట్రాభివృద్ధి విషయంలో ఒకే గొంతుతో మాట్లాడేవారు. కానీ ఇప్పుడు ప్రజలు పార్టీలు, కులమతాల వారీగా చీలిపోవడంతో మంచి చేదుగా, చెడు మంచిగా భావించడం పరిపాటి అయిపొయింది. కానీ ఎవరికి సిఎం చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం నచ్చకపోయినా రాష్ట్రాభివృద్ధిని వ్యతిరేకించడం మాత్రం సరి కాదు.

 

ADVERTISEMENT
Latest Stories