ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక కష్టాల గురించి ఈ రోజు ప్రత్యేకంగా చెప్పేదేముంది. “దినదిన గండం నూరేళ్ళ ఆయుష్షు” మాదిరి ప్రతి రోజు రెవిన్యూ లోటును చూసుకుని, కేంద్రం అనుమతితో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నుండి అప్పులు తెచ్చుకోవడం ఇటీవల కాలంలో పరిపాటిగా మారింది. ఇలా కష్టాల సుడిగుండంలో ఏపీ మునిగి తేలుతూ… కష్టమనే పదానికి పర్యాయపదంగా మారుతోంది.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ పొరుగున ఉన్న చెన్నై నగర బాధలను చూసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 10 కోట్ల సాయాన్ని ప్రకటించి ‘శభాష్’ అనిపించుకున్నారు. కష్టమంటే ఏమిటో తెలిసిన వాడికే ఆ బాధ అర్ధమవుతుంది. గత ఏడాది ‘హుద్ హుద్’ పుణ్యమా అంటూ విశాఖలో ప్రకృతి సృష్టించిన విలయాన్ని చంద్రబాబు కళ్లారా చవిచూశారు. ఆ సమయంలో తమిళనాడు ప్రభుత్వం కూడా ఏపీకి పలు రకాల సాయం అందించింది. ఇప్పుడు విశాఖను మించిన విపత్కర పరిస్థితి చెన్నైకు వచ్చింది. దీంతో పొరుగు రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యతగా 10 కోట్ల రూపాయలను ప్రకటించారు.





