నందమూరి బాలకృష్ణ 99వ సినిమా ‘డిక్టేటర్’ చిత్రం ఆడియోను వచ్చే నెల 20న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. చాలా రోజులుగా ఈ వార్తలు మీడియాలో వస్తున్నా కూడా అందులో నిజం ఏంతో అనే ఉద్దేశ్యంతో ఫ్యాన్స్ పెద్దగా పట్టించుకోలేదు. కాని తాజాగా ఈ చిత్రం ఆడియో అమరావతిలో అంటూ చిత్ర దర్శకుడు ప్రకటించడంతో నందమూరి ఫ్యాన్స్ మరియు తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి శంకుస్థాప జరిగిన తర్వాత అక్కడ జరుగబోతున్న మొదటి పెద్ద సినిమా వేడుక ఇదే కావడం విశేషం. అమరావతిలో మొదటి సినిమా వేడుక బాలయ్యదే అనే అరుదైన ఘనతను తమ అభిమాన హీరో దక్కించుకోబోతున్నాడు అంటూ నందమూరి ఫ్యాన్స్ అంటున్నారు. ఈ ఆడియో వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు మంత్రులు మరియు రాజకీయ ప్రకముఖులు హాజరు అయ్యే అవకాశాలున్నాయి. ఈ సినిమాను శ్రీవాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ సినిమాను సమర్పిస్తోంది. అంజలి మరియు సొనాల్ చౌహాన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా వచ్చే సంవత్సరం జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.





