టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఇలాకాలో నారా, నందమూరి కుటుంబాలు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, చంద్రగిరి మండలంలోని రంగంపేట, పుల్లయ్యగారిపల్లెలో కొద్దిసేపటి క్రితం జల్లికట్టును టాలీవుడ్ అగ్ర నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రారంభించినట్లుగా తెలుస్తోంది.
సంక్రాంతి సంబరాల్లో భాగంగా కనుమ నాడు నిర్వహిస్తున్న జల్లికట్టు ఏళ్ల తరబడి కొనసాగుతూ వస్తున్న అనవాయితీలో భాగంగా ఈ జల్లికట్టు జరుగుతోందని సమాచారం. ఈ క్రీడను కేంద్ర ప్రభుత్వం కాదు కదా సుప్రీంకోర్టు కూడా ఆపజాలదని, సాక్షాత్తు దేవుడే దిగివచ్చినా ఈ జల్లికట్టు ఆగదని రంగంపేట స్థానిక వాసులు మీడియా ముఖంగా పంచుకుంటున్న అనుభూతులు. ఇక వేడుకను ప్రారంభించిన బాలయ్య జల్లికట్టును ఆసక్తిగా తిలకిస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారని, ఇందులో పాల్గొనడం పట్ల “డిక్టేటర్” మిక్కిలి సంతోషాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.





