ఏపీలో బిజేపి మరో 15 ఏళ్ళు ఎదురు చూడగలదా?

BJP’s Next Target in Andhra Pradesh?

బిజేపి జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్ ప్రస్తుతం విశాఖలో రాష్ట్ర బిజేపి నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బిజేపి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలు, జిల్లా ఇన్‌ఛార్జ్‌లతో సమావేశామవుతున్నారు.

ఏపీలో బిజేపిని బలోపేతం చేసుకునేందుకు ప్రతీ ఒక్కరూ కష్టపడి పనిచేయాలని హితవు పలికారు. త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో అత్యధిక సీట్లు గెలుచుకునేందుకు అందరూ కలిసి కట్టుగా ప్రయత్నించాలని హితవు పలికారు.

ADVERTISEMENT

కూటమి ప్రభుత్వంలో బిజేపి భాగస్వామిగా ఉన్నందున కలిసి పోటీ చేస్తామని, కానీ పోటీ చేసిన ప్రతీ సీటుని గెలుచుకునేందుకు గట్టిగా ప్రయత్నించాలని నితిన్‌ నబీన్ చెప్పారు.

ప్రధాని మోడీ నేతృత్వంలో ‘ఆత్మనిర్భర్ భారత్‌’ దేశంలో ఏవిధంగా అభివృద్ధి చెందుతోందో ప్రజలకు వివరించాలని నితిన్‌ నబీన్ సూచించారు.

ఉత్తరాది రాష్ట్రాలలో బలపడి విస్తరించిన బిజేపి, దక్షిణాదిన కూడా బలపడాలనుకోవడం సహజమే. అయితే భాష, ప్రాంతం, మతం బిజేపికి ప్రధాన అవరోధాలుగా కనిపిస్తున్నాయి.

టీడీపి, జనసేనలపై తెలంగాణలో ఏవిధంగా ‘ఆంధ్రా ముద్ర’ ఉంటుందో, అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాలలో బిజేపిపై ‘హిందీ ముద్ర’, ‘ఉత్తరాది పార్టీ’అనే ముద్రలు ప్రధాన అవరోధంగా ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే బిజేపిలో పదవులు, సభలు, సమావేశాల పేర్లు హిందీలోనే ఉంటాయి కూడా.

ఇక బిజేపి మతతత్వ రాజకీయాలు చేస్తుంటుంది కనుక ముస్లిం జనాభా ఎక్కువున్న రాష్ట్రాలు, జిల్లాలలోనే త్వరగా పట్టు సాధించగలుగుతోంది. తెలంగాణలో బిజేపి బలంగా ఉండటానికి ఇదీ ఓ కారణమని అందరికీ తెలుసు.

కానీ ఆంధ్రాలో కుల రాజకీయాలపై బిజేపికి పెద్దగా పట్టు, ఆసక్తి రెండూ లేవు. వాటిపై టీడీపి, వైసీపీ, జనసేనలకు మంచి పట్టుంది. కనుక అవి రాణించగలిగాయి. కనుక ఏపీ బిజేపి నేతలు సొంత బలంతోనే నెగ్గుకొస్తున్నారు.

టీడీపి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, కేంద్రంపై ఆధారపడి మనుగడ సాగిస్తున్నప్పటికీ, ఆంధ్రాలో టీడీపి, జనసేనలపై బిజేపి ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.

‘తెలంగాణ మా నెక్స్ట్ టార్గెట్’ అని చెప్పి వెళ్ళిన ప్రధాని మోడీ, ఆంధ్రాకు నితిన్‌ నబీన్ పంపించడం ద్వారా తెలంగాణ తర్వాత బిజేపి ‘నెక్స్ట్ టార్గెట్ ఆంధ్రా’ అని చెప్పకనే చెప్పినట్లు భావించవచ్చు.

అయితే ఏపీలో చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ కళ్యాణ్‌, నారా లోకేష్‌ ఇద్దరు క్యూలో ఉన్నారు. అంటే కనీసం మరో 15 ఏళ్ళ వరకు ఏపీలో బిజేపికి అవకాశం లభించదు.

ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ని దక్కించుకోవడం కోసం బిజేపి అంతకాలం చాలా ఓపికగా ఎదురు చూసింది. కనుక ఆంధ్రా కోసం మరో 15 ఏళ్ళు ఎదురు చూసే ఓపిక బిజేపి అధిష్టానానికి ఉందనే భావించవచ్చు. ఆ లక్ష్యంతో ఇప్పటి నుంచే చిన్నగా పని మొదలుపెడుతున్నట్లు భావించవచ్చు.

ADVERTISEMENT
Latest Stories