ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధికారిక విధుల్లో బిజీగా ఉన్నందున తన వ్యక్తిగత హాజరునకు మినహాయింపు ఇవ్వాలని సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విన్నవించుకున్నారు. తన తరఫున న్యాయవాది జి.అశోక్ రెడ్డి హాజరయ్యేందుకు అనుమతించాలని కోరారు. దీనిపై సీఆర్పీసీ సెక్షన్ 205 కింద హైదరాబాద్లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో గురువారం పిటిషన్ దాఖలు చేశారు. ప్రతి శుక్రవారం కోర్టుకు తప్పనిసరిగా రావాలని జగన్ కు ఆదేశాలు ఉన్న సంగతి తెలిసిందే.
జగన్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి సరిగ్గా ఈరోజుకు 100 రోజులు. ఇదే రోజు పిటీషన్ వెయ్యడం విశేషం. అదే క్రమంలో సీఎం హోదాలో ఉన్నందున కోర్టుకు హాజరుకావాలంటే ప్రొటోకాల్తోపాటు భద్రతకు భారీగా వ్యయం అవుతుందని రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా అది మంచిది కాదని జగన్ తన పిటీషన్ లో కోర్టుకు తెలిపారు. ప్రతి వాయిదాకు నిందితుల హాజరు అక్కర్లేదని బసవరాజ్ ఆర్.పాటిల్, భాస్కర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని గుర్తు చేశారు.
ఈ పిటీషన్ ఈరోజు కోర్టులో విచారణకు వచ్చింది. అయితే ఈ పిటీషన్ పై హియరింగ్ ను ఈనెల 20కు వాయిదా వేసింది కోర్టు. గతంలో 2014 అప్పుడు, 2017లో పాదయాత్ర సందర్భంగా వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోసం జగన్ దరఖాస్తు చేసుకున్నారు. అయితే అప్పుడు కోర్టు అందుకు ఒప్పుకోలేదు. అయితే ఇప్పుడు రాజ్యాంగ పదవిలో ఉండడంతో కోర్టు మినహాయింపును ఒప్పుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జగన్, ఆయన తరపున లాయర్లు భావిస్తున్నారు.



