చంద్రబాబు – వాజ్ పేయి కాంభినేషన్ ‘సూపర్ హిట్’ అన్నది రాజకీయ విజ్ఞులకు తెలిసిన విషయమే. ఆంధ్రప్రదేశ్ లో జాతీయ రహదారుల అభివృద్ధి నుండి, అమెరికా దేశాధినేతలు హైదరాబాద్ లో కాలు మోపడం వెనుక వాజ్ పేయి నేతృత్వంలోని అప్పటి కేంద్ర ప్రభుత్వం ఏపీకి విశేష సేవలందించింది. దీంతో ఏపీ అభివృద్ధి గతమెన్నడూ లేని విధంగా పురోగతిని సాధించింది.
అయితే హైదరాబాద్ కు ఇంకా కావాలి అని వాజ్ పేయి గారిని అడిగిన సమయంలో “ఒక్కోసారి విసుక్కునే వారని, ఇంకోసారి “బాబూ… అన్నీ నీకేనా..?” అంటూ సంబోధించేవారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ‘కాదు సార్… మాకు కష్టాలొచ్చినాయ్’ అనేవాడ్ని… మాకు జీతాలు కూడా లేవు సార్ ఇవ్వడానికి, ఏం చేస్తాం… ఇచ్చే వారు పైనున్నపుడు, తీసుకునేవాడు కిందున్నపుడు ఇవన్నీ తప్పవని” నాటి మాటలను చంద్రబాబు ఒక్కసారి మననం చేసుకున్నారు.
తానూ దావోస్ పర్యటనకు వెళ్ళింది స్వలాభం కోసం కాదని, పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ఒక ఫ్లాట్ ఫాం దొరుకుతుందని, ఈ క్రమంలో తమ అధికారి రాబర్ట్ ఒకరు గాయాలపాలై కాలు విరిగిందని, అలాగే కేరళ సిఎం కూడా పడిపోయారని… ఏం చేసినా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నానని చంద్రబాబు వివరించారు.





