కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ఇచ్చిన కేటాయింపుల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేసారు. ఓ పక్కన రాష్ట్రం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, మరో వైపు కేంద్రం కనీస చర్యలు కూడా చేపట్టకపోవడం ఆశ్చర్యంగా ఉందన్న అభిప్రాయాలను వ్యక్తపరిచిన చంద్రబాబు, కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ సహా పలువురు కేంద్ర మంత్రులతో ఫోన్ లో సంభాషించారు.
మంగళవారం నాడు జరిగిన టిడిపి రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో ప్రసంగించిన చంద్రబాబు, “ఏపీ అడుగుతోంది గొంతెమ్మ కోర్కెలు కావని, బడ్జెట్ లో కేటాయింపులు చాలా తక్కువగా ఉన్నాయని, రాష్ట్రానికి ఉన్న ఇబ్బందులను గుర్తించి తగు న్యాయం చేయాలని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీని కోరినట్లు తెలిపారు. విభజన బిల్లులో ఉన్న హామీలు కూడా అమలు చేయాలని, ఇలాంటి కేటాయింపులు జరిపితే ఏపీ అభివృద్ధి ఆచరణకు సాధ్యం కాదని, పొరుగు రాష్ట్రాలతో పాటు అభివృద్ధి అయ్యే వరకు కేంద్రం సాయం అందించాలని, రాష్ట్ర ప్రజల మనోభావాలను కేంద్రానికి తెలిపినట్లుగా చంద్రబాబు వివరించారు.
మొత్తమ్మీద కేంద్రం వ్యవహార తీరుతో చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నట్లు స్పష్టమైంది. అయితే బడ్జెట్ లో కేటాయింపులు లేకుండా ఏపీకి నిధులు ఇవ్వగలుగుతుందా? అన్నది ప్రశ్నార్ధకమే! ముఖ్యంగా రెండు సంవత్సరాల రెవిన్యూ లోటు విషయం అసలు ప్రస్తావనకు తేకపోవడం, వాటిని పూడ్చే దిశగా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల రాష్ట్ర సర్కార్ గుర్రుగా ఉంది.





