శుక్రవారం నాడు వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం పనులను సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, గుంటూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండ సందర్శించారు. ఈ సందర్భంగా ఓ వింత అనుభవం చవిచూడడం చంద్రబాబు వంతయ్యింది. సహజంగా ముఖ్యమంత్రిగా కలిసే వారు ప్రభుత్వం నుండి పలు సహాయ సహకారాలు కావాలని అర్దిస్తుంటారు. అయితే ఓ 80 ఏళ్ళ బామ్మ మాత్రం తనకు వస్తున్న పించన్ కూడా వద్దని చెప్పి ముఖ్యమంత్రికి షాక్ ఇచ్చింది.
ఆ వృద్ధురాలి సూచనకు స్పందించిన చంద్రబాబు ఆమె నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని ప్రశంసలు కురిపించారు. వీరిద్దరి మధ్య చోటుచేసుకున్న ఆసక్తికర సంభాషణ…
చంద్రబాబు: అమ్మా… నీకు పింఛను అందుతున్నదా?
వృద్ధురాలు: నాకు పింఛను అక్కర్లేదయ్యా
చంద్రబాబు: ఎందుకనమ్మా?
వృద్ధురాలు: నన్ను నా కూతురు, కుమారులు బాగా చూసుకుంటారు. పింఛను పేదలకు అందితే సంతోషిస్తా.
చంద్రబాబు: అమ్మా… నీ నుంచి మేం నేర్చుకోవాల్సింది చాలా ఉంది.
వృద్ధురాలు: చల్లగా ఉండయ్యా.
ఆ తర్వాత తనను మనస్ఫూర్తిగా ఆశీర్వదించిన వృద్ధురాలిని చంద్రబాబు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆ తర్వాత జరిగిన సభలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు.





