ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 స్మార్ట్ సిటీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విశాఖ, కాకినాడ నగరాలను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో మరో తెలుగు రాష్ట్రం తెలంగాణాలో మాత్రం ఒక్క నగరాన్ని కూడా ఎంపిక చేయకపోవడం చర్చనీయాంశమైంది. అయితే దీని వెనుకున్న అసలు కారణం ఏమిటన్న దానిపై అటు పొలిటికల్ వర్గాల్లో, ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
అయితే చంద్రబాబు ఇచ్చిన తాజా వివరణతో స్మార్ట్ సిటీస్ రహస్యం వీడినట్లయ్యింది. ‘స్మార్ట్ సిటీస్’గా ఎంపిక చేయాలంటే కొన్ని పారామీటర్స్ ఉన్నాయని, అవన్నీ సకాలంలో పూర్తి చేసి స్మార్ట్ సిటీస్ ను ఎంపిక చేసే కమిటీకి పంపించాల్సి ఉందని, వీటితో పాటు డీపీఆర్ లను కూడా సిద్ధం చేయాలని, విశాఖ, కాకినాడలకు ఇవన్నీ అనుకున్న సమయానికే పూర్తి చేసి పంపించామని, అందుకే ఏపీకి రెండు పట్టణాలు ఎంపికయ్యాయని చంద్రబాబు వివరించారు.
తెలంగాణా నుండి కూడా వరంగల్ నగరం ఎంపిక అవుతుందని భావించామని, బహుశా టీఆర్ఎస్ ప్రభుత్వం సదరు ఫార్మాలిటీస్ ను సకాలంలో పూర్తి చేసి ఉండకపోవచ్చని, వచ్చే ఏడాది వరంగల్ ఎంపిక అవుతుందన్న నమ్మకాన్ని వ్యక్తపరిచారు చంద్రబాబు. ఒక రాష్ట్రానికి అడ్మినిస్ట్రేటివ్ సామర్ధ్యత ఎంత అవసరమో చంద్రబాబు మరోసారి నిరూపించారని పొలిటికల్ వర్గాలు పేర్కొంటున్నాయి.





