జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమి గెలుపు ఖాయమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ లో టీడీపీ కేడర్ బలంగా ఉందని, కొంతమంది పార్టీని వీడినా వచ్చిన నష్టం ఏమీ లేదని, తెలుగుదేశంపై ప్రజలకు అచంచల విశ్వాసం, నమ్మకం ఉన్నాయని, అందుకు నిదర్శనమే హైదరాబాద్ లో టీడీపీ-బీజేపీ కూటమి 14 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలు గెలవటమని ప్రస్తావించారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రసంగించిన చంద్రబాబు, “తాము ముందుచూపుతో హైదరాబాద్ లో ఐటీని అభివృద్ధి చేశామని, హైటెక్ సీటీ ప్రాంతంలో గతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, దాని నిర్మాణంతో హైదరాబాద్ దశ తిరిగిందని, నగరంలో పెట్టుబడుల కోసం తమ హయాంలో ఫైల్స్ పట్టుకుని అమెరికాలో తిరిగామని” వివరించారు.
తమ హయాంలో తెచ్చిన ప్రాజెక్టులనే ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తోందని, ఇన్ని నెలలైనా కొత్తగా మీరేమైనా తెచ్చారా? అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నిలదీశారు. హైదరాబాద్ లో తనకేం పనని కొందరు అంటున్నారని, ఈ నగరం తన ‘మానసపుత్రిక’ అని, తాను చేసిన పనులన్నీ సొంతానికి చేసుకోలేదని, ప్రజలకు చేశానని, అదే తనకు సంతృప్తని, అంతేగాక తమ పాలనలో మతసామరస్యాన్ని కూడా కాపాడామన్నారు. ముఖ్యంగా పాతబస్తీలో నెలలపాటు కర్ఫ్యూ ఉండేదని, తమ పాలనలో ఎప్పుడూ అలా ఉంచలేదని, హైదరాబాద్ లో అడుగడుగునా తన ముద్ర ఉందని, కాదనేవారెవరో ఉంటే, ముందుకు రావాలని” సవాల్ విసిరారు.





