మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఉంటున్న ఇంటిని ఎలాగైనా కూలగొట్టాలని కృతనిశ్చయంతో ఉన్న జగన్ ప్రభుత్వం ఆ దిశగా పావులు కదుపుతుంది. ఇందులో భాగంగా ఇప్పటికే వారం రోజుల్లో అక్రమ నిర్మాణాలు తొలగించాలని లేకపోతే మేమే కూలగొడతాం అని నోటీసులు ఇప్పించారు.
చంద్రబాబు ఒకరినే టార్గెట్ చేస్తే కక్షపూరితంగా కనిపిస్తుంది కాబట్టి మరో నలుగురికి నోటీసులు ఇచ్చారు. ఈరోజు ఉదయం ఒక ఇంటిని కూలగొట్టడం మొదలు పెట్టారు. ఉండవల్లిలో ఉన్న చంద్రబాబు నివాసాన్ని ఈ రోజు (సోమవారం) కూల్చేస్తున్నారంటూ ప్రచారం జరిగినా అధికారులు ఈరోజు పాతురి కోటేశ్వరరావు భవనంలోని అక్రమ కట్టడాలు తొలగించడం మొదలు పెట్టారు.
ఇది ఇలా ఉండగా చంద్రబాబు ఇంటి యజమాని… లింగమనేని రమేష్ ఇప్పటికే నిబంధనల ప్రకారమే ఇల్లు కట్టామని.. అన్ని రకాల అనుమతులు ఉన్నాయని, స్విమ్మింగ్ ఫూల్ కు కూడా రివర్ కన్జర్వేటర్ అనుమతి ఉందని సీఆర్డీఏ అధికారులకు పత్రాలతో సహా సమాధానం పంపారు.అధికారులు వాటిని ఒప్పుకొని పక్షంలో హైకోర్టు తలుపు తట్టాలని ప్లాన్ లో ఉన్నారు.
ఈ మధ్య కాలంలో ప్రభుత్వం అనేక వివాదాల్లో ఇరుక్కుంది. ప్రజలలో వ్యతిరేకత పెరుగుతుందని ఈ క్రమంలో ఇటువంటిది ఏదైనా చేసి అసలు విషయాల నుండి వారి దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. చివరి నిముషంలో కోర్టులు ఏమైనా కలగజేసుకుంటే తప్ప చంద్రబాబు ఉంటున్న ఇల్లు కూలదోయ్యడం ఖాయమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.



