బళ్లారి ప్రాంతంలో అక్రమ గనుల కుంభకోణం కేసులో గాలి జనార్దనరెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు కోట్లాది రూపాయల డీల్ కుదుర్చుకున్నాడన్న ఆరోపణలతో దేశవ్యాప్తంగా మారుమ్రోగిన మాజీ న్యాయమూర్తి ప్రభాకర్ రావు కన్నుమూశారు. సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్పల్లిలో నివాసం ఉంటున్న ప్రభాకర్రావు ఆత్మహత్య చేసుకున్నారా? లేదా గుండెపోటుతో మృతి చెందారా? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
జనార్దనరెడ్డి కేసు విచారణకు న్యాయమూర్తిగా వున్న సమయంలో ప్రభాకర్ రావు బెయిల్ విషయంలో లంచం తీసుకుని సీబీఐకి చిక్కిన ప్రభాకర్ రావు ఆపై అరెస్టయి, ఉద్యోగం నుంచి సస్పెండై కొద్దికాలం జైల్లో గడిపిన ఆయన, ఆపై బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు. అప్పట్లో ఈ “బెయిల్” స్కామ్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. దీంతో ఈయన మరణం మరో సంచలనంగా మారింది. గుండెపోటుతో మరణించారా? లేక ఆత్మహత్య చేసుకున్నారా? అన్న అనుమానాలు మరిన్ని కొత్త ప్రశ్నలకు కారణమవుతున్నాయి. ఒకవేళ ఆత్మహత్యే అయితే, దానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి? అన్న అంశాలు మిక్కిలి ఆసక్తికరంగా మారాయి.





