ఆంధ్రా నుంచి నిత్యం వేలాదిమంది భక్తులు వారణాశి (కాశీ)కి వెళ్ళి విశ్వేశ్వరుని దర్శించుకుని వస్తుంటారు. అయితే ఇప్పటి వరకు కాశీకి రైళ్ళే తప్ప విమానాలు అందుబాటులో లేవు. ఒకవేళ ఉన్నా అవి చుట్టుతిప్పి తీసుకువెళ్తుండటం వలన భక్తులకు ఆ మేరకు అదనపు సమయం, టికెట్ ఛార్జీల భారం పెరుగుతుంది. కనుక ఎక్కువ మంది వ్యయప్రయాసలకోర్చి రైళ్ళలోనే వెళ్ళి వస్తున్నారు.
అయితే ఇప్పుడు గన్నవరం నుంచి నేరుగా వారణాశికి విమాన సేవలు ప్రారంభం అయ్యాయి. కనుక గన్నవరం నుంచి నేరుగా కాశీకి వెళ్ళి వచ్చేయవచ్చు.
ఈ నెల 17 నుంచి భోగాపురం, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కూడా విమానసేవలు ప్రారంభం కాబోతున్నాయి. కనుక రాబోయే రోజుల్లో ఈ విమానం అక్కడి నుంచి బయలుదేరి గన్నవరం మీదుగా కాశీ చేరుకునే అవకాశం ఉంది.
కనుక అటు శ్రీకాకుళం నుంచి ఇటు నెల్లూరు, చిత్తూరు వరకు అన్ని జిల్లాల ప్రజలు ఇప్పుడు కాశీ వెళ్ళి రావడం మరింత సులభతరం అవుతుంది.
ప్రస్తుతం రైల్లో కాశీ వెళ్ళేందుకు సుమారు రెండు రోజులు, తిరిగి వచ్చేందుకు మరో రెండు రోజులు సమయం పడుతోంది. ఒకవేళ ఈ విమాన వేళలు, కాశీలో దర్శనాలు అన్నీ సరిగ్గా కుదిరితే ఒకే రోజులో కాశీకి వెళ్ళి తిరిగి వచ్చేయవచ్చు. లేదా ఖచ్చితంగా మర్నాడే తిరిగి వచ్చేయవచ్చు.
ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపి భాగస్వామిగా ఉండటం, దానిలో టీడీపి ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు పౌరవిమానయానశాఖ మంత్రిగా ఉండటం వలననే ఇలాంటివన్నీ సాధ్యపడుతున్నాయని చెప్పక తప్పదు. ఆయన వ్యక్తిగతంగా చొరవ తీసుకొని ఆంధ్రాకు కొత్త విమానాశ్రయాల ఏర్పాటు చేయిస్తున్నారు. అలాగే ఈవిధంగా కొత్త విమాన సేవలు అందుబాటులోకి తెస్తున్నారు.




