హైదరాబాద్ లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి తెలంగాణా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. తెలంగాణా రాష్ట్ర ఐ.టి.శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ ను విశ్వనగరంగా మారుస్తామని గ్రేటర్ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే భాగ్యనగరం లో ఉన్న చారిత్రాత్మక కట్టడాలైన చార్మినార్, గోల్కొండ కోట, బిర్లామందిర్, మూసీ నది, హుస్సేన్ సాగర్ ఇలా ముఖ్యమయిన ప్రదేశాలను 15 నిముషాలలో చుట్టి రావడానికి హెలికాప్టర్ సదుపాయాన్ని కల్పిస్తోంది తెలంగాణా సర్కార్.
ఈ హెలికాప్టర్ లో ప్రయణిoచాలంటే 3,499 రూపాయలను గాల్లోకి ఎగరేసినట్టే! అయితే ఈ ప్రయాణం వల్ల ప్రయాణికుడికి వచ్చే ఆనందంను వేల కట్టలేం అంటున్నారు టూరిజం అధికారులు. ఈ హెలి టూరిజంలో హైదరాబాద్ చుట్టూ చక్కర్లు కొట్టడానికి పైలట్ కాకుండా ఒక రౌండ్ కి నలుగురు ప్రయాణికులను అనిమతిస్తారు. ఈ అవకాశం ప్రస్తుతం వారంతం సెలవు రోజులైన శని, ఆదివారాలలో మాత్రమే అందుబాటులో ఉంచారు. ప్రజల స్పందన ఆధారంగా ఈ సదుపాయాన్ని మరిన్ని రోజులు పెంచే అవకాశం ఉందని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.



